హృదయవిదారకం కాదు... అంతకుమించి... భారత్లో కోవిడ్ పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు...
భారత్లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు హృదయవిదారకం కంటే మించి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) చీఫ్ టెడ్రోస్ అధనొమ్ పేర్కొన్నారు. భారత్కు అండగా నిలిచేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని... అవసరమైన క్రిటికల్ ఎక్విప్మెంట్,మెడికల్ సప్లై అందజేస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్య సమితి హెల్త్ ఏజెన్సీ కూడా భారత్కు వేలాది ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,ప్రీఫాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్,లేబోరేటరీ సప్లై అందజేస్తోందన్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ తరుపున 2600 మంది నిపుణులను భారత్కు పంపించినట్లు టెడ్రోస్ వెల్లడించారు. కరోనాపై పోరులో భారత్కు వీరు తమ సాయం అందిస్తారని చెప్పారు.
ఇప్పటికే యూకె,అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్,ఆస్ట్రేలియా,చైనా తదితర దేశాలు భారత్కు సాయం చేస్తామని ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్కు వెంటిలేటర్లు,ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,మెడికల్ ఎక్విప్మెంట్ పంపిస్తామని యూకె ప్రకటించింది.మొత్తం 600 మెడికల్ పరికరాలతో కూడిన మొదటి షిప్ బ్రిటన్ నుంచి మంగళవారం(ఏప్రిల్ 27) భారత్ చేరనుంది. ఇందులో 495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు,20 మాన్యువల్ వెంటిలేటర్లు ఉండనున్నాయి.
భారత్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులను తక్షణమే భారత్కు పంపిస్తామని అమెరికా ప్రకటించింది. అంతకుముందు వీటిపై ఆంక్షలు విధించినప్పటికీ ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా సాయం అందించేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది. ఇరు దేశాల మధ్య పరస్పర సహాయ,సహకారాలపై భారత ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. కరోనాపై పోరులో భారత్కు అమెరికా మద్దతు పట్ల మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా నుంచి భారత్కు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు రవాణాపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
Recommended Video
అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు మరోసారి తన సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ సందర్భంగా... భారత్కు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. వెంటిలేటర్లు,కోవీషీల్డ్ ముడి సరుకు,ఇతరత్రా వైద్య సామాగ్రి,మెడికల్ సప్లైని అందిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో అమెరికాకు భారత్ ఎలాగైతే సాయం అందించిందో... ఇప్పుడు భారత్కు కూడా అమెరికా అలాగే సాయం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు.