ట్రంప్ మాటతీరుతో తల పట్టుకుంటోన్న భారత్
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన వైమానిక దాడులు, యుద్ధాన్ని తానే నిలువరించానని పునరుద్ఘాటించారు.
పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై వైమానిక దాడులు సాగించింది భారత్. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాద సంస్థలను పెకిలించివేసింది. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్న విషయం తెలిసింది.

రెండు రోజుల పాటు భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు.
ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారు. హేగ్ లో నాటో సభ్య దేశాల సదస్సుకు హాజరయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విదేశీ పర్యటనకు రావడం డొనాల్డ్ ట్రంప్కు ఇది రెండోసారి. గతంలో ఆయన సౌదీ అరేబియాలో పర్యటించిన విషయం తెలిసిందే.
హేగ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ట్రంప్. భారత్- పాకిస్థాన్ యుద్ధం, పరస్పర దాడుల గురించి ప్రస్తావించారు. యుద్ధం వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి వివరించారు. యుద్ధం కంటే చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనీ చెప్పుకొచ్చారు. యుద్ధ నివారణ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.
వరుస ఫోన్ కాల్స్ ద్వారా భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ముగించానని తేల్చి చెప్పారు. ఇది కొనసాగివుంటే అణు యుద్ధంగా మారేదని వ్యాఖ్యానించారు. దాడులు- ప్రతిదాడులు సాగిస్తే తాము ఎలాంటి వాణిజ్య ఒప్పందాలను చేసుకోబోమని స్పష్టం చేశానని, దీనితో ఈ రెండు దేశాలు దిగివచ్చాయని అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ను ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ఆయన పనితీరును తనను ఆకట్టుకుందని అన్నారు. మునీర్ కు వైట్ హౌస్ లో విందు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. ట్రేడ్ డీల్ ద్వారా వారిని ఆలోచించేలా చేశానని పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలను భారత్ ఇదివరకే ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటికీ స్వాగతించబోమని తేల్చి చెప్పింది. భారత్- పాకిస్తాన్ డీజీఎంఓ స్థాయి అధికారుల హాట్ లైన్ చర్చల ద్వారానే ఈ యుద్ధానికి తెరదించినట్లు వివరించింది. ట్రంప్ ద్వారా గానీ, ట్రేడ్ డీల్స్ వల్ల గానీ యుద్ధాన్ని ఆపలేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications