ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆకృత్యాలు మొదలయ్యాయ్: మహిళా పోలీస్ అధికారిని..ఆమె పిల్లల ముందే
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదానికి, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది. అలాంటి దురాగతాలను మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు. అరాచక పరిపాలనకు పాల్పడుతున్నారు.
భయాందోళనలకు తగినట్టే..
తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాబోతోన్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. షరియా చట్టాన్ని తీసుకుని రావడం ద్వారా మళ్లీ తమపై కనీవినీ ఎరుగని అత్యంత కఠినమైన ఆంక్షలను విధిస్తారంటూ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు వ్యక్తపరుస్తోన్న అనుమానాలన్నీ వాస్తవ రూపాన్ని దాల్చుతున్నాయి. ప్రాణాలకు తెగించి.. పుట్టిన గడ్డను వదిలి ఇతర దేశాలకు ఎందుకు వెళ్లి పోవాలనుకుంటున్నారో.. దాన్ని నిరూపించే ఘటనలు ఆప్ఘనిస్తాన్లో వరుసగా చోటు చేసుకుంటూ వస్తోన్నాయి.
షరియా చట్టానికి అనుగుణంగా..
తాలిబన్లు అమలు చేయదలిచిన షరియా చట్టం ప్రకారం.. ఆప్ఘనిస్తాన్ మహిళలు ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకూడదు. మగ తోడు లేకుండా వీధుల్లో తిరగకూడదు. పురుషులు గడ్డం గీసుకోకూడదు. దీనికి అనుగుణంగా వారు గడ్డాలు పెంచడం మొదలు పెట్టారు. మహిళలు నల్లటి ముసుగులు, పొడవైన దుస్తులు ధరించడం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు కనిపించట్లేదు. ఇదివరకటితో పోల్చుకుంటే మహిళల సంచారం బాగా తగ్గింది.
మహిళా పోలీస్ అధికారి హత్య
ఈ పరిణామాల మధ్య తాలిబన్ ఫైటర్లు ఓ మహిళా పోలీస్ అధికారిణి దారుణంగా హత్య చేశారు. ఆమె పిల్లల ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతరం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా ముఖాన్ని ఛిద్రం చేశారు. హతురాలిని బాను నెగర్గా గుర్తించారు స్థానికులు. సెంట్రల్ ఆప్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రావిన్స్ రాజధాని ఫిరోజ్కోలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తాలిబన్ ఫైటర్ల చేతుల్లో హత్యకు గురయ్యే సమయానికి ఆమె ఎనిమిది నెలల గర్భిణి కూడా.
స్క్రూ డ్రైవర్లతో..
ఫిరోజ్కో సిటీలో కొంతకాలంగా తాలిబన్ ఫైటర్లు ప్రతి ఇంటినీ అన్వేషిస్తోన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బాను నెగర్ను గుర్తించి.. ఫిరోజ్కో సిటీ నడిబొడ్డున ఆమెను హత్య చేశారు. ఆమె చంపడానికి స్క్రూడ్రైవర్ను వినియోగించినట్లు అనుమానిస్తోన్నారు. రక్తపుమడుగులో పడివున్న బాను నెగర్ మృతదేహానికి కొద్దిదూరంలో రక్తంతో తడిచిన స్క్రూడ్రైవర్ను స్థానికులు గుర్తించారు.
Recommended Video
తమ పని కాదంటోన్న తాలిబన్లు
బాను నెగర్ హత్యోదంతం పట్ల తాలిబన్లు స్పందించారు. ఈ ఘటనలో తాలిబన్ ఫైటర్ల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఫిరోజ్కో సిటీకి చెందిన ఫైటర్లతో మాట్లాడానని, బాను నెగర్ హత్యలో తమ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల, వృద్ధులు, పిల్లల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని తాము ఇదివరకే అధికారికంగా ప్రకటించామని ముజాహిద్ చెప్పారు.