మరో ఏడాదిలో నీళ్లు బంద్.. దేశ చరిత్రలోనే మైండ్ బ్లాకింగ్ వాటర్ క్రైసిస్!
అత్యంత ధనిక దేశంగా, సర్వసౌకర్యాలకు నిలయంగా భావించే అమెరికాలోనే ఊహించని తీవ్ర నీటి సంక్షోభం తలెత్తింది. సుమారు మూడు లక్షలకు పైగా జనాభా కలిగిన టెక్సాస్ రాష్ట్రంలోని తీరప్రాంత నగరం 'కార్పస్ క్రిస్టీ' త్వరలోనే తీవ్ర నీటి కొరతను ఎదుర్కోబోతోంది. అమెరికా చరిత్రలోనే నీటి నిల్వలు పూర్తిగా శూన్యానికి చేరుకోబోతున్న తొలి నగరంగా ఇది నిలవనుండటం ప్రపంచదేశాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా వర్షపాతం తగ్గడం, నగరంలో నీటి వినియోగం విపరీతంగా పెరగడం, కొత్త ప్రత్యామ్నాయ వనరులను సమయానికి ఏర్పాటు చేసుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.
పరిశ్రమల దాహానికి చెరువులు ఖాళీ!
ఈ నీటి సంక్షోభం వెనుక నగరంలో పెరిగిన పారిశ్రామిక ప్రాజెక్టులు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఇక్కడ ఉన్న భారీ పెట్రోకెమికల్ పరిశ్రమల నిర్వహణకు ప్రతిరోజూ కోట్లాది లీటర్ల నీరు అవసరమవుతోంది. 2022లో ప్రారంభమైన ఒక ప్లాస్టిక్ రసాయన కర్మాగారం కూలింగ్ ప్రక్రియ కోసం రోజువారీగా ఉపయోగించే నీరు.. కార్పస్ క్రిస్టీ నగర ప్రజలందరూ వాడే నీటితో సమానమని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఒకవైపు తీవ్రమైన కరవు నెలకొంటే.. మరోవైపు పరిశ్రమల మితిమీరిన వాడకంతో డ్యామ్లు, జలాశయాల్లో నీటి మట్టాలు అడుగుంటిపోయాయి.

సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్రాజెక్టు ఆలస్యం!
ఈ సమస్యకు ముందే పరిష్కారం కనుగొనేందుకు స్థానిక యంత్రాంగం సముద్రపు నీటిని తాగడానికి ఉపయోగపడేలా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని భావించింది. రోజుకు వందల మిలియన్ల లీటర్ల నీటిని శుద్ధి చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణం విపరీతమైన ఖర్చు, నిధుల కొరత, పర్యావరణ అనుమతులు మరియు స్థానిక వ్యతిరేకత కారణంగా నిలిచిపోయింది. దీనితో ప్లాంట్ నిర్మాణానికి అనేక సంవత్సరాలు పట్టేలా ఉండటంతో నీటి కష్టాలు తక్షణమే తీరే మార్గం లేకుండా పోయింది.
మరో ఏడాది వరకే నీటి నిల్వలు.. విపత్కర స్థితిలో నగరం!
పర్యావరణ నిపుణులు వెల్లడించిన కథనాల ప్రకారం.. అమెరికాలోని ఇతర నగరాల కంటే కార్పస్ క్రిస్టీ అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు మరో ఏడాదికి మాత్రమే సరిపోతుంది. ఇది అత్యవసర పరిస్థితికి సంకేతమని స్పష్టం చేస్తున్నారు. లోతైన బోరు బావులు తవ్వడం, వ్యర్థ నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు మళ్లించడం వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
కఠినమైన నిబంధనలు.. రేషన్ విధానం వైపు కార్పస్ క్రిస్టీ!
పరిస్థితి మరింత క్షీణించడంతో నగర ప్రజలపై ఇప్పటికే అనేక పరిమితులు విధించారు. గార్డెనింగ్కు, వాహనాలు కడగడానికి నీటిని వాడకూడదని ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సంక్షోభం మరింత ముదిరితే నీటి సరఫరా వేళల్లో కోతలు విధించడం లేదా తాత్కాలికంగా సరఫరా నిలిపివేయడం వంటి అత్యవసర చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశ్రామిక అవసరాల మధ్య నీటి నిర్వహణ సరిగా లేకపోతే ఎలాంటి నగరానికైనా ఎలాంటి గతి పడుతుందో ఈ ఉదంతం ప్రపంచానికి కన్నువిప్పు కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications