గ్రీన్ కార్డు హోల్డర్స్ కు బిగ్ షాక్.. ట్రంప్ నిర్ణయంతో భారతీయుల్లో ఆందోళన..!
అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనే వలసదారుల అత్యున్నత కల ఇకపై మరింత ఖరీదైనదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఆ దేశ పౌరసత్వం (సిటిజన్షిప్) పొందే ప్రక్రియ భారీగా ప్రియం కానుంది. గ్రీన్కార్డ్ హోల్డర్లు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమర్పించే 'ఫారమ్ ఎన్-400' (Form N-400) రుసుములను రికార్డు స్థాయిలో పెంచాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది.
ఈ కొత్త సవరణలు అమల్లోకి వస్తే దరఖాస్తు ఫీజు సుమారు 80 శాతం వరకు పెరగవచ్చు. ముద్రిత పద్ధతిలో కాగితం రూపంలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్న 760 డాలర్ల రుసుము ఎగబాకి ఏకంగా 1,330 డాలర్లకు చేరనుంది. అదేవిధంగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 710 డాలర్లకు బదులుగా భవిష్యత్తులో 1,280 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థాయి భారీ పెంపు ప్రవాస వర్గాలకు గట్టి షాక్గా మారింది.
ఫీజుల పెంపుతో సరిపెట్టకుండా, నిరుపేదలకు ఇప్పటివరకు లభిస్తున్న రాయితీలను సైతం పూర్తిగా రద్దు చేయాలని అమెరికా యంత్రాంగం యోచిస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం అమల్లో ఉన్న 380 డాలర్ల రాయితీ ఫీజుతో పాటు, పూర్తి ఫీజు మినహాయింపు (ఫీజ్ వేవర్) ప్రయోజనాన్ని రద్దు చేయాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. ఆర్థిక వ్యత్యాసాలతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులందరిపై సమానంగా భారం మోపాలనే ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారతీయ వలసదారులపై తీవ్ర ప్రభావం
అమెరికా పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి వేచి చూసేవారిలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 6.7 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారు. ఇటీవల కాలంలో భారతీయులకు లభించే గ్రీన్కార్డుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. అధికారిక గణాంకాల ప్రకారం 2022లో దాదాపు 1.27 లక్షల మంది భారతీయులకు గ్రీన్కార్డులు లభించగా, 2023లో ఆ సంఖ్య 78 వేలకు పడిపోయింది. ఆ తర్వాత 2024 నాటికి కేవలం 66,800 మంది భారతీయ దరఖాస్తుదారులకే గ్రీన్కార్డులు దక్కడం గమనార్హం.

ఈ ఫీజుల ప్రతిపాదన ప్రస్తుతం బహిరంగ సమీక్ష దశలోనే ఉంది. ప్రజలు, వివిధ సంఘాలు తమ అభిప్రాయాలను తెలిపిన తర్వాతే దీనిపై అధికారులు తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకవేళ ఇవే నిబంధనలు ఖరారైతే, అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలపై ఊహించని ఆర్థిక భారం పడుతుంది. సుదీర్ఘకాలం ఇమ్మిగ్రేషన్ కష్టాలను ఎదుర్కొని చివరి దశకు చేరుకున్న వారికి ఈ అదనపు ఖర్చులు పెద్ద అవరోధంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications