భారత్ కు ట్రంప్ స్పెషల్ విషెస్..
భారత్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన భారత్ కు విషెస్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తమ సోషల్ మీడియా పోస్ట్లో పంచుకున్నారు. అమెరికా, భారత్ రెండు దేశాలు ప్రపంచంలోనే ప్రాచీనమైన, అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
"యునైటెడ్ స్టేట్స్ ప్రజల తరపున.. 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్రంప్ తన సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
తీవ్ర సుంకాల విధానంతో భారత్ ను గతంలో విమర్శించిన ట్రంప్, "ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్, భారతదేశం చారిత్రక బంధాన్ని పంచుకుంటున్నాయి" అని పేర్కొన్నారు. జనవరి 26, 2026న దిల్లీలోని కర్తవ్య పథ్ లో గణతంత్ర దినోత్సవ పరేడ్ అనంతరం మధ్యాహ్నం 2:14 గంటలకు, అమెరికా రాయబార కార్యాలయం తమ ఎక్స్ ఖాతాలో ఈ సందేశాన్ని పోస్టు చేసింది.

మరోవైపు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ లను ముఖ్య అతిథులుగా భారత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. వారికి ఆతిథ్యమివ్వడం భారత్ కు దక్కిన విశేష గౌరవమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
"ఆ దేశాధినేతల ఉనికి భారత్- యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యం బలాన్ని, ఉమ్మడి విలువల పట్ల మన నిబద్ధతను తెలియజేస్తుంది" అని ప్రధాని స్పష్టం చేశారు. "ఈ పర్యటన భారత్, యూరప్ మధ్య పలు రంగాలలో సహకారాన్ని మరింత విస్తరింపజేస్తుంది" అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) త్వరలో ప్రకటన ఊహాగానాల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో భారత్, అమెరికా నుండి కొనుగోలు చేసిన సైనిక పరికరాలను ఎక్కువగా వినియోగిస్తోంది. గణతంత్ర దినోత్సవ పరేడ్లోని ఫ్లైపాస్ట్ లో యూఎస్-నిర్మిత C-130J రవాణా విమానాలు, అపాచి హెలికాప్టర్ లు సహా పలు వైమానిక ప్లాట్ ఫారమ్ లు పాల్గొన్నాయి. అయితే, సాధారణ వాణిజ్య సంబంధాలలో భారత్, అమెరికా మధ్య తీవ్ర ప్రతికూల పరిణామాలు కనిపించాయి. ట్రంప్, భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలను, రష్యా నుండి చమురు కొనుగోళ్లపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది.
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు గత ఏడాది ఇరుదేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయినప్పటికీ, భారత్ తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను అమెరికాకు తెరిచేందుకు వాషింగ్టన్ చేసిన డిమాండ్ల కారణంగా ఈ ఒప్పందం ఇంకా కార్యరూపం దాల్చలేదు. సుంకాల వివాదంతో పాటు మరికొన్ని అంశాలు సంబంధాలను ప్రభావితం చేశాయి. గత ఏడాది మేలో 'ఆపరేషన్ సింధూర్' అనంతరం భారత్- పాకిస్థాన్ వివాదాన్ని ముగించినట్లు ట్రంప్ చేసిన ప్రకటన, అలాగే వాషింగ్టన్ నూతన వలస విధానం ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications