పేరు భారత్ది- ఫండ్స్ బంగ్లాదేశ్కు?: ఎగదోసిన అమెరికా?
Donald Trump: భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఏర్పాటైన ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎన్నికల వ్యవస్థ గురించీ ప్రస్తావించారు.
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కు..
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కు మొన్నటివరకు 21 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ తాజాగా దీన్ని నిలిపివేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పైనా సంతకం చేశారు. భారత్ సహా మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులనూ రద్దు చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక పన్నులు..
దీన్ని సమర్థించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కు తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. భారత్ను అత్యధిక పన్నులు విధించే దేశంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులను విధించే దేశాల్లో భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యానించారు.
భారత్కు కాదా?
ఈ నిధులను అమెరికా కేటాయించింది భారత్కు కాదంటూ తాజాగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ఈ 21 మిలియన్ డాలర్ల మొత్తం కూడా 2022లో బంగ్లాదేశ్కు కేటాయించినట్లు వెల్లడించింది. ఇందులో- 13.4 మిలియన్ డాలర్లను ఇప్పటికే బంగ్లాదేశ్కు చెల్లించినట్లు పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి..
ఇందులో పలు షాకింగ్ అంశాలను పొందుపరిచింది ది ఇండియన్ ఎక్స్ప్రెస్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, ఆమె పదవీచ్యుతురాలు కావడానికి సరిగ్గా ఏడు నెలల ముందు ఈ నిధులు విడుదల అయ్యాయని, 2024 జనవరిలో ఆ దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అనిశ్చితికి, అంతర్యుద్ధానికి, ఎన్నికల ప్రక్రియ కావడానికి ముందే ఈ ఫండ్స్ బంగ్లాదేశ్కు చేరినట్లు పేర్కొందా కథనం.
గతంలోనే ట్రంప్ అభ్యంతరం..
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ చెల్లింపులను అప్పట్లోనే డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఎయిడ్) కింద భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి అమెరికా నిధులను ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదంటూ గతంలోనే విమర్శించారు ట్రంప్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిలిపివేశారు.
డోజ్ లిస్ట్లో..
21 మిలియన్ డాలర్ల చెల్లింపులను యూఎస్ఎయిడ్ కింద గ్రాంట్లుగా చూపించడం వివాదాస్పదమౌతోంది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పన చేస్తోన్న కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ (సీఈపీపీఎస్) ద్వారా ఈ నిధులు మంజూరు అయ్యాయి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, ఓటర్ల ప్రక్రియను సులభతరం చేయడం వంటి కారణాలతో ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
2008 వరకు..
నిజానికి- సీఈపీపీఎస్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ఎయిడ్ కింద భారత్కు నిధులను విడుదల చేసే విధానం 2008 వరకూ లేదు. ఆ తరువాతే ఇది తెరమీదికి వచ్చింది. ఫెడరల్ అవార్డ్ ఐడెంటిఫికేషన్ నంబర్ AID117LA1600001 కింద 2016 సెప్టెంబర్లో నిధుల చెల్లింపులు ఆరంభం అయ్యాయి. 2026 జులై వరకూ ఈ నిధుల విడుదల కొనసాగుతుంది. ఇప్పటివరకు 13.2 మిలియన్ల డాలర్లు మంజూరయ్యాయి.
ఢాకాకు చెల్లింపులు.
2022 నవంబర్లో ఈ గ్రాంట్ పక్కదారి పట్టినట్లు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. యూఎస్ఎయిడ్లో భాగమైన నాగొరిక ప్రోగ్రామ్కు మళ్లించినట్లు రికార్డుల్లో ఉందని తెలిపింది. అమర్ ఓటు అమర్ (నా ఓటు నా గని) అనే బంగ్లాదేశ్ ప్రాజెక్ట్కు మళ్లించినట్లు వివరించింది. ఇదే విషయాన్ని 2024 డిసెంబర్లో ఢాకా యూఎస్ఎయిడ్ రాజకీయ వ్యవహారాల సలహాదారు సైతం ధృవీకరించారు. యూఎస్ఎయిడ్ కింద అమెరికా చెల్లిస్తోన్న 21 మిలియన్ డాలర్ల సీఈఈపీఎస్/నాగోరిక్ ప్రాజెక్ట్కు తాను పని చేస్తోన్నట్లు వెల్లడించారు.
2022 నుంచి..
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా కోసం కేటాయించిన యూఎస్ఎయిడ్ గ్రాంట్ 21 మిలియన్ డాలర్లల్లో 2022 నుంచి ఇప్పటివరకు 13.4 మిలియన్లు బంగ్లాదేశ్కు మళ్లించినట్లు తేలింది. 2022 జులై- 2024 అక్టోబర్ మధ్యకాలంలో ఆరు సబ్ గ్రాంట్లుగా దీన్ని విభజించినట్లు తేలింది. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్కు మంజూరు చేశారు.
సబ్ గ్రాంట్స్ వినియోగం ఇలా..
2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతురాలు కాగా.. అదే ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన యూనివర్శిటీ ఆఫ్ ఢాకా ప్రొఫెసర్ ఐనుల్ ఇస్లాం తన ఫేస్బుక్, లిక్డ్ ఇన్లో పెట్టిన పోస్ట్ ఒకటి అనేక అనుమానాలను రేకెత్తించింది. సివిల్ వార్ రాత్రికి రాత్రి చోటు చేసుకున్నది కాదని వెల్లడించారాయన.
యూత్ ఈవెంట్స్కు ఖర్చు..
బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర క్యాంపస్లల్లో 544 యూత్ ఈవెంట్స్ జరిగాయని, వాటి నిర్వహణ కోసం అమెరికా విడుదల చేసిన 13.4 మిలియన్ డాలర్ల నుంచి ఖర్చు చేసి ఉండొచ్చని ఐనుల్ అనుమానించారు. యూత్ డెమోక్రటిక్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు. దీని కింద 10,264 మంది యూనివర్శిటీ విద్యార్థులు, 221 ప్రాజెక్టులు, 170 డెమోక్రసీ సెషన్స్ నిర్వహించారని తెలిపారు. వాటికి ఈ నిధులను చెల్లించి ఉండొచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications