సౌదీలో జరా భద్రం ! ఇద్దరు భారతీయుల తలలు నరికివేత .. కన్నుకు కన్ను .. పన్నుకు పన్ను అక్కడ అంతే..
రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అమలు చేసే కఠిన శిక్షల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఇద్దరు భారతీయుల విషయంలోనూ ఇది రుజువైంది. తోటి ఇండియన్ను చంపినందుకు శిక్షగా సౌదీ ప్రభుత్వం ఇద్దరు పంజాబీల తలలు తెగనరికింది. ఫిబ్రవరి 28న జరిగిన ఘటనకు సంబంధించి అక్కడి సర్కారు ఇండియన్ ఎంబసీకి కనీస సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
అత్యాచారం చేశాడు...రుజువులున్నాయి..కానీ శిక్ష వేయలేనన్న జడ్జి
మద్యం మత్తులో బయటపడ్డ నిజం
పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన సత్వీందర్ కుమార్, లూధియానాకు చెందిన హర్జీత్ సింగ్ ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. అక్కడ వారికి ఆరిఫ్ ఇమాముద్దీన్ పరిచయమయ్యాడు. అయితే ఉద్యోగం దొరకకపోవడంతో వారు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఓ రోజున చోరీ చేసిన డబ్బు విషయంలో ముగ్గురి మధ్య మాటమాట పెరిగింది. సత్వీందర్, హర్జీత్ సింగ్లు క్షణికావేశంలో ఆరిఫ్ను చంపేశారు. ఆ విషయం బయటకు రాకపోవడంతో అప్పటికి తప్పించుకున్నారు. కొన్ని రోజులకు తాగి గొడవ చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు నిజం బయటపడింది.
మరణశిక్ష విధించిన కోర్టు
ఆరిఫ్ ఇమాముద్దీన్ హత్యోదంతం వెలుగులోకి రావడంతో 2015 డిసెంబర్ 9 పోలీసులు వారిపై కేసు బుక్ చేశారు. విచారణ నిమిత్తం రియాద్ జైలుకు తరలించారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో అక్కడి కోర్టు వారికి మరణశిక్ష విధించింది. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. భారత ఎంబసీకి సమాచారం ఇవ్వకుండానే సౌదీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇద్దరి తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది.
సత్వీందర్ భార్య పిటీషన్
సౌదీ వెళ్లిన భర్త ఆచూకీ తెలియకపోవడంతో సత్వీందర్ భార్య సీమారాణి కోర్టు మెట్లెక్కింది. దీంతో విదేశాంగ శాఖ అధికారులు సత్వీందర్ చనిపోయినట్లు స్పష్టం చేశారు. వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవని కోర్టుకు విన్నవించారు. సత్వీందర్, హర్వీందర్ డెడ్ బాడీలను ఇండియాకు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సౌదీ అరేబియాలోని కఠిన చట్టాల కారణంగా మృతదేహాలను అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించింది.
సౌదీ చర్యను ఖండించిన పంజాబ్ సీఎం
ఇద్దరు పంజాబీల తలలు తెగనరికిన సౌదీ ప్రభుత్వ తీరుపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం చేసిన పనిని క్రూరమైన, అమానవీయ చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధించి విదేశాంగ శాఖ నుంచి సమగ్ర నివేదిక కోరారు.