US-China talks:డ్రాగన్ కంట్రీపై కన్నెర్ర చేసిన పెద్దన్న..ఫలించని చర్చలు
అమెరికా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనావర్గం చైనా అధికారులతో తొలిసారిగా ముఖాముఖి భేటీ అయ్యింది. అయితే రెండు దేశాల మధ్య సాగిన చర్చలు ఫలించకపోగా ఇరు దేశాల మధ్య నేతలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేస్తూ టీవీల్లో కనిపించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.
అమెరికా రక్షణ కార్యదర్శితో ప్రధాని మోదీ భేటీ... ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చర్చ...
అలాస్కా వేదికగా అమెరికా-చైనా చర్చలు
అలాస్కా వేదికగా జరిగి అమెరికా-చైనా చర్చలు ఫలించలేదు. రెండు రోజుల పాటు జరిగిన హైలెవెల్ చర్చల సందర్భంగా ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు బహిరంగంగానే ఒకరి విధానాలపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇదంతా టీవీ కెమెరాల ముందే జరగడం విశేషం. ఈ చర్చల ద్వారా ఎలాంటి దౌత్యపరమైన ముగింపునకు చేరుకోలేకపోయాయి ఇరు దేశాలు.అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య శతృత్వం మరింత పెరిగిందనే చెప్పాలి. గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంతగా అమెరికా చైనా సంబంధాలు తొలిసారిగా దెబ్బతిన్నాయి. చర్చలు ప్రారంభం కాగానే అమెరికా మిత్రదేశాలైన జపాన్, సౌత్కొరియాలకు స్నేహహస్తం అందించడంపై చైనా అభ్యంతరం తెలిపింది.
చైనాతో కఠినంగా వ్యవహరించాం
చైనాతో పలు అంశాలపై ప్రత్యక్ష చర్చలు చేపట్టి కఠినంగానే వ్యవహరించాలని భావించినట్లు వైట్హౌజ్ జాతీయ భద్రతాధికారి జేక్ సలివెంట్ చెప్పారు. చెప్పాలనుకున్నది ఎలాంటి మొహమాటం లేకుండా ముఖంపై చెప్పామని ఆయన స్పష్టం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత చైనా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే చైనా ప్రభుత్వ ఛానెల్ సీజీటీఎన్తో ఆదేశ దౌత్యాధికారి యాంగ్ జీచే మాట్లాడుతూ... అమెరికాతో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని చెబుతూనే ఇంకా రెండు దేశాల మధ్య విబేధాలకు చెక్ పడలేదని వివరించారు. చైనా ఎట్టిపరిస్థితుల్లోను దేశ భద్రతపై, అభివృద్ధిపై రాజీ పడబోదని స్పష్టం చేశారు.
చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది
చైనా నుంచి ఇలాంటి సమాధానం రావడంపై తానేమీ ఆశ్చర్యానికి గురికాలేదని చెప్పారు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్. చైనాలోని క్సింజియాంగ్, టిబెట్, హాంగ్కాంగ్ దేశాల్లో చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సైబర్ దాడులకు కూడా డ్రాగన్ కంట్రీ దిగుతోందని అదే సమయంలో తైవాన్పై రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొస్తోందని అన్నారు. ఇక రెండు దేశాలు ఇరాన్, ఉత్తరకొరియా, అఫ్ఘానిస్తాన్ దేశాలపై ఆసక్తికరమైన చర్చ జరపమడే కాకుండా వాతావరణ మార్పులు కూడా చర్చించినట్లు బ్లింకెన్ వివరించారు. ఇక ఆర్థికపరమైన అంశాలు, వాణిజ్యపరమైన అంశాలు కాంగ్రెస్తో పాటు తమ మిత్రదేశాలతో కూడా చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చైనాతో చెప్పినట్లు బ్లింకెన్ చెప్పారు.