ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన ప్రమాదం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ద్వారా స్విట్జర్లాండ్లోని దావోస్కు బయల్దేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో ఎలక్ట్రికల్ సమస్య ఏర్పడినట్లు పైలట్లు గుర్తించి.. భద్రత దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే విమానాన్ని తిరిగి వాషింగ్టన్ డీసీకి మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఎయిర్ఫోర్స్ వన్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటిగా పేరొందింది. అమెరికా అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన అత్యాధునిక వ్యవస్థలు ఇందులో అమర్చబడి ఉంటాయి. అయినప్పటికీ, చిన్న సాంకేతిక లోపం కనిపించినా ముందస్తు జాగ్రత్తగా ప్రయాణాన్ని రద్దు చేయడం సాధారణ ప్రక్రియేనని వైమానిక నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటన సమయంలో ట్రంప్ పూర్తిగా సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. విమానం తిరిగి ల్యాండ్ అయిన వెంటనే సాంకేతిక బృందాలు సమస్యను పరిశీలించడం ప్రారంభించాయి.
ఇక దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యం, రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సుకు ట్రంప్ హాజరు ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా భావించారు. అయితే ఈ సాంకేతిక సమస్య కారణంగా ఆయన ప్రయాణం వాయిదా పడే అవకాశముందని సమాచారం. సమస్య పూర్తిగా పరిష్కారమైన తర్వాత మరో విమానంలో ట్రంప్ దావోస్కు బయల్దేరే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications