హాట్ టాపిక్.. వీణా రెడ్డి: ట్రంప్ నిర్ణయం వెనుక అదృశ్య హస్తం ఆమెదేనా?
Donald Trump: భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఏర్పాటైన ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎన్నికల వ్యవస్థ గురించీ ప్రస్తావించారు.
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కు..
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కు మొన్నటివరకు 21 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ తాజాగా దీన్ని నిలిపివేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పైనా సంతకం చేశారు. భారత్ సహా మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులనూ రద్దు చేశారు.

ఈ కేటాయింపుల రద్దు వెనుక..
ప్రత్యేకించి- ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియాకు కేటాయించిన నిధులు రద్దు కావడం వివాదాస్పదమౌతోంది. ఈ నిధులను బంగ్లాదేశ్కు సైతం మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2022 నుంచి ఇప్పటివరకు 13.4 మిలియన్ డాలర్ల మొత్తాన్ని యూఎస్ఎయిడ్ గ్రాంట్ కింద బంగ్లాదేశ్కు చెల్లించారనే ఆరోపణలు వ్యక్తమౌతోన్నాయి.
కొత్త పేరు..
ఈ వివాదాస్పద పరిస్థితుల మధ్య ఓ కొత్త పేరు తెరమీదికి వచ్చింది. అదే- వీణా రెడ్డి. ఏపీకి చెందిన మహిళ. గతంలో యూఎస్ఎయిడ్కు భారత ప్రతనిధిగా పని చేశారు. తాజాగా రాజకీయ వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్టు, దానిపై డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది.
కాంగ్రెస్ వల్లే అమెరికా జోక్యం..
దేశ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందనే విషయం బట్టబయలైందని బీజేపీ ఆరోపించింది. 2023లో విదేశీ పర్యటన సందర్భంగా భారత్లో ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేస్తోన్నారు.
మహేష్ జెఠ్మలానిదీ అదే మాట..
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికే 2021లో యూఎస్ఎయిడ్కు భారత ప్రతినిధిగా వీణా రెడ్డి నియమితులయ్యారని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ ఆరోపించారు. గత లోక్సభ ఎన్నికల తరువాతే ఆమె అమెరికాకు తిరిగి వెళ్లారని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనే విషయంపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని, వీణారెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎవరీ వీణారెడ్డి..
ఏపీలో జన్మించిన వీణా రెడ్డి భారతీయ-అమెరికన్ దౌత్యవేత్త. అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్లో కెరీర్ సభ్యురాలిగా పనిచేశారు. భారత్, భూటాన్ల్లో మిషన్ డైరెక్టర్గా ఉన్నారు. కాంబోడియా, హైతీల్లో యూఎస్ఎయిడ్ కింద వివిధ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, చికాగో యూనివర్శిటీల్లో చదువుకున్నారు.












Click it and Unblock the Notifications