అమెరికాలోతుఫానుల విధ్వంసం, పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాను వరదలు, టోర్నడోలు కకలావికలం చేస్తున్నాయి. తీవ్రమైన టోర్నడోల వల్ల డల్లాస్ ప్రాంతంలో కనీసం 11 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. దక్షిణ, మధ్య అమెరికాల్లోి పలు ప్రాంతాలపై బలమైన టోర్నడోలు, తుఫానులు ప్రతాపం చూపిస్తున్నాయి.
మిడ్ వెస్ట్లో వరదల వల్ల మరో పన్నెండు మంది మృతి చెందారు. డల్లాస్, కొలిన్, ఇల్లిస్ నగరాలపై తుఫానులు ప్రభావం చూపిస్తున్నాయి. డల్లాస్లో కొన్ని ఇళ్లు, వాహనాలు, విద్యుత్తు స్తంభాలు ధ్వంసమయ్యాయి. తూర్పు ఇల్లిస్ వైపు ఓ బలమైన టోర్నడో దూసుకొచ్చింది.
డల్లాస్ నగరంలో ఇండ్లు నేలమట్టమయ్యాయని, వాహనాలు కొట్టుకుపోయాయని, విద్యుత్ వైర్లు తెగిపోయాయని, చెట్లు విరిగిపడ్డాయని, దాదాపు నలభై కిలోమీటర్ల మేర నష్టం జరిగిందని, అధికారులు తెలిపారు. గంటకు 166 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.
కాగా, టోర్నడోలు, వరదల వల్ల అమెరికాలో మంగళవారం వరకు 44 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఏడు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోమవారం నాడు 2,100 విమానాలు రద్దు కాగా, 3,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి.