మంత్రి జయరాం కే కాదు ఆ ఎమ్మెల్యేకు 100 కోట్లకు గాలం వేశారట .. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలనం
ఆలూరు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో చంద్రబాబు నాయుడు పార్టీ మారాలని కోరారని అందుకు రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్యే వీ వరప్రసాద్ టీడీపీ గతంలో తమను ఏ విధంగా ప్రలోభపెట్టిందో చెప్పి అసెంబ్లీలో సంచలనం సృష్టించారు.

టీడీపీలో చేరితే , పార్టీ ఫిరాయిస్తే 100 కోట్ల ఆఫర్ చేసిన మాజీ సీఎం తనయుడు , కడప ఎంపీ అన్న ఎమ్మెల్యే
ఇక తాను నోరు తెరిస్తే అవమానంతో చస్తారని మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే వీ వరప్రసాద్ తాను గతంలో వైసీపీ తిరుపతి ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశంలో చేరితే, తనకు రూ. 50 కోట్ల క్యాష్ తో పాటు మరో 50 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారని గూడూరు ఎమ్మెల్యే వీ వరప్రసాద్ ఆరోపించారు. టీడీపీ మొత్తం రూ. 100 కోట్ల ఆఫర్ ను తన ముందు ఉంచిందని అయినా తాను ప్రలోభపడలేదని గూడూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత వి.వరప్రసాద్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కుమారుడు లోకేష్ , కడప జిల్లాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు, మరో నలుగురు మంత్రులు ఆ సమయంలో తనతో పాటు ఉన్నారని చెప్పారు. వారంతా కలిసి తనను ప్రలోభ పెట్టాలని చాలా ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.

కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చెయ్యలేక పార్టీ మారలేదన్న వీ వరప్రసాద్ .. టీడీపీపై ఫైర్
తాను వారి ఆఫర్ ను తిరస్కరించానని, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళటం కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేయడం అని భావించి పార్టీ మారటం తనకు ఇష్టం లేక వెళ్లలేదని ఆయన అన్నారు. ఇక గతంలో టీడీపీ హయాంలో వైసీపీ టికెట్ పై గెలిచి తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభ పెట్టి పార్టీ మారేలా చేశారో తనకు అప్పుడు తెలిసిందని ఆయన ఫైర్ అయ్యారు . అందుకే తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్యే చివరకు మిగిలిందని ఎద్దేవా చేశారు. తాను నోరు తెరిచి మరిన్ని మాట్లాడితే, తెలుగుదేశం నేతలు అవమానంతో చావాల్సిందేనని వీ వరప్రసాద్ టీడీపీపై నిప్పులు చెరిగారు.

టీడీపీకి తలనొప్పిగా ఫిరాయింపు ప్రలోభాల అంశం .. ఒక్కొక్కరుగా బయటపెడుతున్న వైసీపీ నేతలు
ఇక నిన్నటికీ నిన్న వైసీపీ మంత్రి జయరాం కూడా తనను ప్రలోభ పెట్టాలని చూసారని నియోజకవర్గ పర్యటనలో చెప్పి సంచలనం సృష్టించాడు. గతంలో చంద్రబాబు నాయుడు పార్టీ మారాలని కోరారని అందుకు రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని తాను తిరస్కరించానని చెప్పారు . మీరు ఆఫర్ చేసే రూ.50 కోట్లు, మంత్రి పదవి నా వెంట్రుకతో సమానం అంటూ తిప్పి పంపిన వ్యక్తినని ఆయన తన పర్యటనలో ప్రజలతో చెప్పుకొచ్చారు. ఇలా రోజుకొకరు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ప్రలోభాలకు గురి చేసిందని చెప్పటం అటు టీడీపీకి తలనొప్పిగా మారుతుంటే , రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేస్తుంది.












Click it and Unblock the Notifications