కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్
కరీంనగర్: కరోనా మహమ్మారితో మనమంతా సహజీవనం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమే లేదన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు మొత్తం లాక్డౌన్ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.

ఎన్ని ఉద్యోగాలు పోతాయో..
కరీంనగర్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ.. ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం లాక్డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని అన్నారు. అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని తెలిపారు.

కరోనాతో సహజీవనం.. ప్రజలే బాధ్యతగా..
కరోనాతో సహజీనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని మంత్రి వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23వేల కేసులు వెలుగుచూస్తే.. మరణాలు 300 వరకే నమోదయ్యాయని తెలిపారు. అయినా కొంతమంది ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.

మరణాలు ఎలా దాచగలం..
పరీక్షలు చేయట్లేదు.. డేటా దాస్తున్నారని అనవసర విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని కేటీఆర్ ప్రశ్నించారు. అక్కడక్కడా లోపాలు లేవని మాత్రం తాను అనడం లేదని చెప్పారు. వాటిని ఎలా సరిదిద్దాలో విపక్షాలు సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు.
ఫార్మాలో మనమే టాప్..
ఫార్మా రంగం అంటే కాలుష్యం అనే అపవాదు ఉందని, కానీ, మన రాష్ట్రం నుంచి పని చేస్తున్న నాలుగు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం దూసుకుపోతున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో మంత్రి కేటీఆర్ హరితహారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలేవీ లేవని, ఈ కార్యక్రమంలో నాటిన 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్ పదవి పోతుందని హెచ్చరించారు. హరితహారానికి రాజకీయానికి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications