కేసీఆర్ సర్కార్ కూలుతుంది.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రైతులు, యాసంగి పంట గురించి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతదని ఈటల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్రావు, పరామర్శించారు.
రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరి పంట వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటుందన్నారు. బియ్యం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వర్షాకాలం వడ్లన్నీ వెంటనే కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే పంటపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతుల ఉసురుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. టీఆర్ఎస్ మొసలి కన్నీటిని రైతులు నమ్మొద్దని సూచించారు. రైతాంగానికి బీజేపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. రవి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలను అందజేశారు.
ఇటు ఇవాళ రైతు రవికుమార్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల కూడా పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరి వేసుకోవద్దనే హక్కు కేసీఆర్కు లేదన్నారు. కొనుగోలు సెంటర్లు అన్నీ ప్రారంభం కాలేదు. కేవలం 30 శాతం మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలన్నారు. కేంద్ర రైట్ అని నేను చెప్పడం లేదు. కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా పరామర్శించి.. అండగా ఉంటామని తెలిపారు.