16 + 150 ఇది కేటీఆర్ లెక్క
సిరిసిల్ల : తెలంగాణ ప్రచార బరిలో కారు టాప్ గేర్లో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని అంచనా వేస్తోంది. 16 టీఆర్ఎస్ సీట్లు సాధిస్తే కలిగే ప్రయోజనం ఏంటో ప్రతి సభలో వివరిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ 16, కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు 150 మంది ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలతోనేనని మరోసారి స్పష్టంచేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేటీఆర్.
అదీ లెక్క
రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కేటీఆర్. ఒక్క స్థానంలో ఎంఐఎం విజయం ఖాయమని అంచనా వేశారు. టీఆర్ఎస్ 16 స్థానాలతోపాటు మరో 150 సీట్లు ప్రాంతీయ పార్టీలు గెలుస్తాయని జోస్యం చెప్పారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, జగన్, టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ పార్టీల సీట్లు 150కి చేరుతాయని .. అప్పుడు టీఆర్ఎస్ 16 సీట్లతో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో ప్రభుత్వం ఏర్పడుతోందని లెక్కగట్టారు.
ప్రాజెక్టులకు 90 శాతం నిధులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి అంటే ఇది అని చూపించాం, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు కేటీఆర్. రాష్ట్రంలో మనం 16 చోట్ల గెలిస్తే కేంద్రం మెడలు వచ్చి రావాల్సిన నిధులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు 90 శాతం నిధులు తీసుకోవచ్చని .. దీంతో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి .. గ్రామాల్లో జలసిరులు పారుతాయని చెప్పారు.
నీతి ఆయోత్ సిఫారసు చేసిన దిక్కులేదు
నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ పథకానికి మోదీ సర్కార్ నీళ్లివ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వేలైన్ ఇవ్వాలని కోరినా పట్టించుకునే నాథుడే లేడని గుర్తుచేశారు. అదే మనం ఢిల్లీలో అధికారంలో ఉంటే మన చిరకాల వాంఛను నెరవేర్చుకోవచ్చు కదా అని ప్రజలకు వివరించారు కేటీఆర్.
సాకారమవనున్న హామీలు
ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ .. 16 మంది ఎంపీలను ఇస్తే మన రాష్ట్రానికి అందని ద్రాక్షలా ఉన్నా హామీలను నెరవెర్చుకోవచ్చని పేర్కొన్నారు.