ప్రేమలేని లోకం: పెళ్లి చేసుకున్నా.. విడదీసిన పెద్దలు, సోదరి ఇంట్లో నవవధువు, జైల్లో వరుడు ఆత్మహత్య
సంగారెడ్డి: ఒకరికొకరు దగ్గరి బంధువులైన వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, వివాహం అయిన తర్వాత ఇరుకుటుంబాల పెద్దలు వారిద్దరినీ కలవనీయలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదుతో నవ వరుడు జైలుపాలయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన ప్రియురాలు లేని జీవతం తనకెందుకు అని అతడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మేనమామ కూతుర్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా..
ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామానికి చెందిన తేళ్ల భానుచందర్(24) డ్యాన్సర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న తనకంటే రెండేళ్లు పెద్దదైన మేనమామ కుమార్తె స్వర్ణలతను ప్రేమించాడు. యువతి తరపువారు పెళ్లికి అంగీకరించకపోవడంతో గత మార్చి 10న గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, యువకుడికి ఆస్తి లేదన్న కారణంతో అమ్మాయి తరపు కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దర్నీ దూరంగా ఉంచారు.

ప్రేమజంటను విడదీసిన పెద్దలు.. సోదరి ఇంట్లో నవవధువు ఆత్మహత్య
స్వర్ణలతను సనత్నగర్లోని సోదరి ఇంట్లో ఉంచారు. పెళై రెండు నెలలైనా భర్తతో కలిసి జీవించే అవకాశం లేకపోవడం, పెద్దవాళ్లు అంగీకరిస్తారనే నమ్మకం కూడా సన్నగిల్లడంతో జనవరి 5న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో స్వర్ణలత ఆత్మహత్యకు భర్తే కారణమంటూ ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భాను చందర్పై వరకట్న వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జైల్లో మనోవేదనతో భానుచందర్ ఉరివేసుకుని బలవన్మరణం
జనవరి 24న సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి రిమాండ్ ఖైదీగా తరలించారు. ఓ వైపు ప్రేమించి పెళ్లిచేసుకున్న ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం, జైలుపాలవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భానుచందర్ సోమవారం ఉదయం 6 గంటల సమయంలో స్నానాల గదిలో దుప్పటితో వెంటిలేటర్ చువ్వలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమికుల రోజే ఇతడు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. భార్య తరపు వాళ్లే తమ కుమారుడి మరణానికి కారణమయ్యారని మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమలేని లోకంలో ఉండలేనంటూ సూసైడ్ లేఖలో భానుచందర్
కాగా, తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దంటూ 14 పేజీల సూసైడ్ లేఖలో బాధితుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. నా భార్య చనిపోవడానికి ముందు కూడా నాతో వీడియో కాల్లో మాట్లాడింది. నాతో కలిసి నూరేళ్లు బతకాలనే కోరికను తెలిపింది. ఆమెతో కలిసి ఉండలేకపోయాననే బాధ, ఆమె మరణానికి పరోక్షంగా కారణమయ్యాననే ఆవేదన నన్ను అనుక్షణం బాధిస్తోంది. నాకు భూమి, డబ్బు లేదంటూ తరచూ నా భార్య కుటుంబసభ్యులు అనే మాటలు వింటుంటే నరకంలో ఉన్నట్లు అనిపించేది. పిల్లల్ని కనడం చంపుకోవడానికి కాదనే విషయాన్ని పెద్దలు గుర్తించాలి. ఈ భూమిపై వాళ్లు సంతోషంగా ఉంటే.. చాలనుకోవాలి. అలా అనుకోని.. ప్రేమలేని లోకంలో ఉండలేక చనిపోతున్నానంటూ భానుచందర్ తన సూసైడ్ లేఖలో తెలిపాడు.












Click it and Unblock the Notifications