తలకు దెబ్బతగిలిందని వెళితే.. స్టాప్లర్తో పిన్నులు కొట్టాడు
వరంగల్: గాయమైందని వైద్యుడి వద్దకు వెళితే.. గాయాన్ని తగ్గించాల్సింది పోయి.. మరింత పెంచే విధంగా చేశాడు ఓ అతితెలివి వైద్యుడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని తొర్రూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురై గాయపడింది.
నుదుటిపై గాయం కావడంతో నేరుగా తొర్రూరులోని ఎంబిబిఎస్ వైద్యుడు స్వరూప్ కుమార్ వద్దకు వెళ్లింది. ఆమె గాయాన్ని పరిశీలించిన స్వరూప్ కుమార్ తన దగ్గర స్టాప్లర్తో పిన్నులు కొట్టాడు. కుట్లు వేయాల్సి పోయి.. పిన్నులు కొట్టడాన్ని గమనించిన ఆమె భర్త ఆశ్చర్యానికి గురయ్యాడు. అదేంటి డాక్టర్.. కుట్లు వేయకుండా.. అలా పిన్నులు కొట్టారని ప్రశ్నించాడు.
ఏమి కాదు త్వరలోనే తగ్గిపోతుందని జవాబిచ్చాడు డాక్టర్ స్వరూప్. అయితే నొప్పి తగ్గకపోవడంతో ఆమె వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లింది. ఆమె గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. పిన్నుల కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.
ఆ తర్వాత పిన్నులు తొలగించి ఆమెకు చికిత్స అందించారు. ఇది ఇలా ఉండగా.. పిన్నుల విషయమై స్వరూప్ కుమార్ను ప్రశ్నించగా.. చాలా మందికి పిన్నులు వేసి వైద్యం చేశానని, ఎవరికీ ఏమి కాలేదని బదులిచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఎంబిబిఎస్ చదివారా లేక కొన్నారా? అని మండిపడ్డారు.