ఇష్టం లేని పెళ్లి: ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య
తాము ప్రేమలో ఓడిపోయామంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట.. ప్రేమికుల దినోత్సవానికి ఒక్కరోజు ముందు... పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
వికారాబాద్: తాము ప్రేమలో ఓడిపోయామంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట.. ప్రేమికుల దినోత్సవానికి ఒక్కరోజు ముందు... పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల సమీపాన సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన మధు(22), ఓ యువతి (16) ప్రేమికులు. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపహరణ కేసు కింద మధును రిమాండుకు తరలించారు.
ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన మల్లేశ్(వరుసకు బావ)తో యువతికి పెళ్లిచేసి, పిట్టలగూడలోనే కాపురం పెట్టారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనంచేసి నిద్రించిన యువతి... ఆదివారం తెల్లారేసరికి కనిపించలేదు. దీంతో మధుపై అనుమానం వ్యక్తంచేస్తూ యువతి కుటుంబ సభ్యులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులకు ఫోన్చేసి, తాము పోలేపల్లి దగ్గర ఉన్నామనీ, ఇద్దరం కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారి కోసం గాలింపు చేపట్టారు.
సోమవారం సాయంత్రం దుద్యాల సమీపంలోని కృష్ణగిరిగుట్టపై మధు, సదరు యువతి విగతజీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.