సినిమా తలపించేలా: ఇద్దరు భర్తల పాట్లు, బీరు సీసాతో తలపగలగొట్టిన భార్య ప్రియుడు
హైదరాబాద్: సినిమాలను తలపించే ఘటనలు ఇటీవలి కాలంలో నగరంలో పెరిగిపోయాయి. తాజాగా రెండు ఘటనలు సినీ ఫక్కీలో చోటు చేసుకున్నాయి. విడాకుల కోసం దరఖాస్తు చేసిన భార్య రెండో పెళ్లికి భర్తే డిటెక్టివయ్యాడు. ఆ కథ అనేక మలుపులు తిరగడంతో చివరికి కత్తిపోటుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మరో ఘటనలో.. భార్య ప్రియుడి చేతిలో దాడికి గురయ్యాడో భర్త.
ఈ ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బేగంపేటలోని ఒక అపార్ట్మెంట్లో మహేందర్, శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. మహేందర్ ఓ మద్యం షాపులో పనిచేస్తున్నాడు. శ్వేత స్వయం ఉపాధి ద్వారా కొంత సంపాదిస్తోంది. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు.
అయితే, గత ఐదారు నెలలుగా వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఆర్థిక సమస్యలు కూడా తోడవటంతో అవి తారస్థాయికి చేరాయి. దీంతో ఇద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరయ్యాక.. మరో పెళ్లి చేసుకోవాలని శ్వేత నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో మ్యాట్రిమోనీ సైట్లో వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అది చూసిన అదే ప్రాంత నివాసి కృష్ణమూర్తి ఆమెకు ఫోన్చేశాడు. తనకు గతంలో పెళ్లయిందని.. భార్య నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపాడు. శ్వేతకు ఇష్టమైతే పెళ్లికి సిద్ధమన్నాడు.
కాగా, తాను ఇచ్చిన ప్రకటనకు వచ్చిన స్పందన గురించి శ్వేత భర్తకు చెప్పింది. తనంటే ఇష్టపడుతున్న వ్యక్తి వివరాలు ఇచ్చింది. దీంతో అతడు కృష్ణమూర్తి గురించి వాకబు చేశాడు. రెండు మూడు రోజులపాటు తిరిగి వివరాలు సేకరించి భార్యకు చెప్పాడు. కృష్ణమూర్తి నడవడిక మంచిది కాదని.. అబద్ధాలు చెప్పి అవసరం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వివరించాడు.
దీంతో, అతడితో మాట్లాడి అసలు విషయం తేల్చుకోవాలనే ఉద్దేశంతో.. సోమవారం రాత్రి తమ ఇంటికి రావాల్సిందిగా భార్యాభర్తలిద్దరూ కృష్ణమూర్తిని ఆహ్వానించారు. అతడు వచ్చాక పెళ్లి విషయమై చాలా సేపు చర్చించారు. అతడు చెప్పేమాటలు వాస్తవం కాదంటూ వాగ్వాదానికి దిగారు.

మోసం చేయాలని చూస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించారు. దీంతో.. 'పెళ్లి ప్రకటన ఇచ్చి నన్నే మీరు మోసం చేశారు' అంటూ కృష్ణమూర్తి వారిపై ఎదదురుతిరిగాడు. గొడవ ముదరడంతో అక్కడ కనిపించిన కూరగాయల కత్తితో అతడు మహేందర్ ఛాతీపై పొడిచి పరారయ్యాడు.
స్థానికుల సహకారంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
భర్తపై భార్య ప్రియుడి దాడి: బీరు సీసాతో తల పగలగొట్టాడు
మరో ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హబీబ్ఫాతిమానగర్కు చెందిన సబీన్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అతడికకి రేష్మతో అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా పుట్టింది. కొన్నాళ్ల తర్వాత.. విజయవాడకు చెందిన రెడ్డినాయుడు అనే వ్యక్తితో రేష్మకు పరిచయం ఏర్పడింది.
అది క్రమంగా ప్రేమకు దారి తీయడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనికి రేష్మ తల్లిదండ్రులు కూడా సమ్మతించడంతో రెడ్డినాయుడు అత్తగారింట్లోనే కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న సబీన్ తన భార్యను, కుమార్తెను తీసుకువెళతా అంటూ రేష్మ ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో రెడ్డినాయుడు, సబీన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన రెడ్డినాయుడు అక్కడే ఉన్న ఖాళీ బీరు సీసాతో సబీన్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సబీన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డినాయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, నబీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications