యువతులు, మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. వ్యభిచార గృహాలకు విక్రయం!
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో కొనసాగుతున్న ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని వ్యభిచార ముఠా చేస్తున్న ఘోరాలు ఓ సామిజిక కార్యకర్త సాహసం చేయడంతో బయటపడ్డాయి. మాయమాటలు చెప్పి మహిళలు, యువతుల నగ్నపొటోలు, వీడియోలు తీసి వారి ధరను నిర్ణయిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
బీదర్ నుంచి హైదరాబాద్ పాతబస్తీకి..
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా బసవకళ్యాణ్ తాలూకా రాజేశ్వర్ గ్రామానికి చెందిన నిందితుడు సయ్యద్ హుస్సేన్(35) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే, ఇతడు కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార గృహాల నిర్వాహకుడు గులాంకు ప్రధాన అనుచరుడు. ఈ క్రమంలో గులాం ఆదేశాలతో హుస్సేన్ వారం రోజుల క్రితం హైదరబాద్ నగరంలోని పాతబస్తీకి చేరాడు.
మాయమాటలు, డబ్బు ఆశచూపి.. తన గదిలో యువతులతో..
బార్కస్ సలాలాలో నివాసం ఉంటున్న తన మరదలిని కలిశాడు. ఇక్కడే ఏదన్నా ఉపాధి వెతుక్కుంటానని ఆమెకు చెప్పాడు. దీంతో తన ఇంట్లోనే అద్దెకు ఉండేందుకు ఆమె అంగీకరించింది. ఇక పాతబస్తీలో తిరుగుతూ ఉపాధి వెతుక్కుంటున్నట్లు నమ్మించేవాడు. ఫలక్నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలిసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవాడు. మాయమాటలు, డబ్బుల ఆశ చూపి మహిలలు, యువతులకు నమ్మించి తన గదికి తీసుకొచ్చేవాడు.
మహిళలు, యువతులను నగ్నంగా చేసి పొటోలు, వీడియోలు తీసి..
ఆ తర్వాత మహిళలు, యువతులను నగ్నంగా చేసి, వారి ముఖాలు కనిపించకుండా వారి శరీర భాగాలను సెల్ఫోన్లలో ఫొటోలు తీసేవాడు. ఆ పొటోలను వాట్సాప్ ద్వారా గులాంకు పంపించేవాడు. వాటిని చూసి వారి ధరను నిర్ణయించేవాడు గులాం. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికిపైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులనున్నట్లు తెలిసింది. అయితే, హుస్సేన్ దారుణాలు ఓ సామాజిక కార్యకర్త దృష్టికి వచ్చాయి.
సామాజిక కార్యకర్త ధైర్యంతో.. నిందితుడు హుస్సేన్ అరెస్ట్
ఈ క్రమంలో వ్యభిచార ముఠా ఆటకట్టించేందుకు మరో మహిళతో కలిసి ఆమె కూడా అతడి గదికి వెళ్లారు. పొట్టిగా ఉన్నావని.. ఆమెను అతడు తిరస్కరించాడు. పక్కనే ఉన్న మరో మహిళను సోమవారం మంచిగా తయారై వస్తే ఫొటోలు, వీడియోలు తీసి ధర నిర్ణయిస్తానని చెప్పాడు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, పోలీసు సిబ్బంది బార్కాస్ చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, నిందితుడి సెల్ఫోన్లో మహిళలు, యువతులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీదర్ కేంద్రంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలకు నగరం నుంచి మహిళలు, యువతులను, బాలికలను కూడా కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.