రైలు కిందపడి టెక్కీ ఆత్మహత్య: గుంతలో పడి ఇద్దరు యువకుల గల్లంతు
రంగారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లి పాత ఎమ్ఐజి కాలనీకి చెందిన క్రిష్ణకాంత్ ఆదివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
క్వారీ గుంతలో ఇద్దరు యువకులు గల్లంతు
క్వారీ గుంతలో ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైనా సంఘటన శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ గూడ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకొంది. విషయం తెలిసిన వెంటనే ఆర్జీఐ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు.

క్వారీ గుంత లోతు ఎక్కువ ఉండటం, చీకటి పడటంతో గల్లంతైన వారి కోసం వెతకడం విరమించుకున్నారు.ఆర్జీఐ ఠాణా ఎస్సై మహమ్మద్ నాసర్ తెలిపిన కథనం ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు హిమాయత్సాగర్ జలాశయాన్ని సందర్శించి అనంతరం కొత్వాల్గూడ గుట్టల్లో ఉన్న క్వారీ గుంతల వైపు వచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండు కుండలా మారిన క్వారీగుంతలో సరదాగా ఈత కొట్టడానికి దిగారు. గుంత లోతును గమనించకుండా ఈత కోసం దిగడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలు తెలియరాలేదని, చీకటి పడడంతో గాలింపు ఆపేసినట్లు ఎస్సై తెలిపారు. సోమవారం ఉదయం వారి కోసం మళ్లీ గాలింపు చేపట్టనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications