ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం: ఈ విజిలెన్స్ ఎస్పీ కోటీశ్వరుడే
రైస్మిల్లర్ల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన నల్గొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ భాస్కర్రావు స్వగృహంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.
వరంగల్: రైస్మిల్లర్ల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన నల్గొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ భాస్కర్రావు స్వగృహంలోనూ (హన్మకొండ కనకదుర్గకాలనీలో) ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం నుంచి తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చేందిన భాస్కర్ 1989లో పోలీసుశాఖలో ఎస్సైగా ఉద్యోగంలో చేరారు.
పోలీస్శాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఎస్సై, సీఐగా విధులు నిర్వర్తించారు. ఎస్సైగా ఆత్మకూరు, పరకాల, మట్టెవాడ, నర్సంపేట ప్రాంతాలలో పనిచేశారు. సీఐగా మడికొండ, మట్టెవాడలో విధులు నిర్వర్తించారు. మట్టెవాడ ఎస్సైగా పని చేస్తుండగా లాకప్డెత్ కావడంతో భాస్కర్రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కొన్ని భూములకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాలలో కూడా భాస్కర్రావుకు సంబంధించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆత్మకూరు మండలం ఉరుగొండ గ్రామంలో వ్యవసాయభూమి, లేబర్కాలనీలో ప్లాట్ ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలలో ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబు, ఇన్స్పెక్టర్ రాఘవేందర్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా భాస్కర్రావు ఇంటి ముందు తాళం వేసి లోపల సోదాలు చేశారు. భాస్కర్రావు ఇంట్లో రూ.లక్ష నగదు, విదేశీ మద్యం సీసాలు లభించాయి. విదేశీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వారు దీనిపై కేసు నమోదు చేశారు.