సింగరేణిలో ఘోర ప్రమాదం: కూలిన పైకప్పు, ముగ్గురు మృతి
పెద్దపల్లి: రామగుండం సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం సింగరేణి ఆండియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఘటనా స్తలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సమావేశాల్లో ప్రమాదాల నివారణకు సూచనలు ఇచ్చినప్పటికీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. గత ఐదు నెలల్లో ఇది మూడో ప్రమాదమని అన్నారు.
సింగరేణిలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని త్వరితగతిన బయటికి తీసుకురావాలని ఆదేశించారు.