జిన్నారం అడవుల్లో ఏలియన్స్, గొర్రెల్ని చంపి తిన్నాయని, సిసిటీవీ ఫుటేజీలంటూ?(ఫోటోలు)
అదిలాబాద్ జిల్లాలోని జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
హైదరాబాద్/అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలోని జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
జిన్నారం అడవుల్లో ఏలియన్స్ కనిపించాయని, అవి గొర్రెలను చంపుకొని తిన్నాయని, అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో ఇవన్నీ నిక్షిప్తమయ్యాయని కూడా పేర్కొంటున్నారు.
ఏలియన్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్
అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో దొరికిన ఫోటోలు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లలో పంపిస్తున్నారు.
గొర్రెలు చనిపోవడంతో.. సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు
జిన్నారంలోని ఓ గూడెంలో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి. ఇలా పలుమార్లు జరగడంతో అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఫోటోల్లో పెద్ద పాదం కనిపించిందని ప్రచారం జరిగింది.
పాదం, కాలివేళ్లు.. గ్రహాంతరవాసులను పోలి ఉన్నారని..
ఫోటోల్లో చూస్తే ఆదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలి వేళ్లు ఉన్నాయని, గ్రహాంతర వాసులను పోలిన వ్యక్తులుగా ఉన్నారని ప్రచారం సాగింది.
వైరల్
ఫోటోల్లో కనిపించే జీవికి రెండు పొడవాటి తెల్లని కొమ్ములు, కాలికి పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయని ప్రచారం సాగింది. ఇది వైరల్ అయింది. వీటిని చాలామంది షేర్ చేస్తున్నారు.
అంతా అబద్దమని..
అయితే ఈ ఫోటోలు అన్ని కూడా నిజమైనవి కావని చాలామంది కొట్టి పారేస్తున్నారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఎక్కడా ఆధారాలు లభించలేదని అంటున్నారు.