నేడే సీతారాముల కల్యాణ మహోత్సవం - ప్రభుత్వం పట్టు వస్త్రాలు : సర్వం సిద్దం..!!
నేడు సీతారాముల కల్యాణోత్సవం. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సిద్దమైంది. పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణంలో వేడుక జరగనుంది. కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములవారి శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడును కనులారా తిలకించి పులకించేందుకు భక్తికోటి తరలి వస్తున్నారు.

రెండేళ్ల తరువాత ప్రత్యక్ష వీక్షణకు
కరోనా కారణంగా భక్తులు లేకుండానే రెండేళ్ల పాటు సాగిన కల్యాణ వేడుక ఈ సారి అశేష భక్తజన సందడి మధ్య నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా.. మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతమ్మవారి తరఫున కొందరు, రామయ్య వారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి 'మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పదంటూ'వేడుకను రక్తి కట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ముత్యాల తలం బ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. వరుసగా ఆరోసారి ఆయన గైర్హాజరవుతున్నారు.

ప్రభుత్వ పట్టు వస్త్రాలు అందచేత
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వామివారి పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని రాములోరి కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సారి భక్తుల తాకిడి పెరుగుతుండటం, ప్రముఖుల రాక ఎక్కువ ఉండటంతో పోలీసు శాఖ ఎక్కడా ఇబ్బందులు లేకండా దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు చేసింది.

సాంప్రదాయ బద్దంగా... ఘనంగా కళ్యాణోత్సవం
మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాన ఘట్టానికి వేదిక అయిన మిథిలా స్టేడియానికి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే ముందుగా మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించనున్నారు. తర్వాత యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహిస్తారు. భక్తుల కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు సిద్ధంచేశారు. భద్రాచలం క్షేత్రానికి ఆర్టీసీ 400 బస్సులను నడుపుతున్నది. సోమవారం శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది.












Click it and Unblock the Notifications