నిరూపించకపోతే నాల్క కోస్తాం: రేవంత్పై సుమన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపి బాల్క సుమన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నాల్క కోస్తామని హెచ్చరించారు. ఆరోపణలు మానుకోకపోతే సరైన బుద్ధి చెప్తామని అన్నారు. సిఎంపై ఓ బఫూన్ మాట్లాడితే ఓ వర్గం మీడియా అతిగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. సామాన్య వ్యక్తిగా ఉన్న రేవంత్ రెడ్డి కోట్లకు ఎట్లా పడగలెత్తారని ప్రశ్నించారు. త్వరలోనే రేవంత్ రెడ్డి బండారం బయటపెడ్తామని అన్నారు. కాంట్రాక్టర్లను బెదరించి రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించారని, ఆ డబ్బులతోనే జూబ్లీహిల్స్లో బిల్డింగ్ కడుతున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకుని ప్రజల ముందు పెడతామని అన్నారు.

కంపోసర్గా పని చేసిన ఆయనకు వందల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి చేసిందేమి లేదని సుమన్ అన్నారు. దమ్ముంటే ప్రజాకోర్టుకు తేదీని ప్రకటించాలని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుకు ఓటేసినట్లేనని అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు. రాజకీయ అసూయతో కెసిఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మరో నేత మర్రి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.
మెదక్ ఉప ఎన్నికల్లో గెలుపు మాదే: నాయిని
మెదక్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మెదక్ ప్రచారానికి గన్ పార్క్ నుంచి తెలంగాణ న్యాయవాదుల జెఏసి చేపట్టిన బస్సుయాత్రను నాయిని జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు తమ అభ్యర్థి గెలుపుకోసం ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. మెదక్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని మంత్రి టి హరీశ్ రావు అన్నారు. కిషన్ రెడ్డి పేరుకే తెలంగాణ బిజెపి అధ్యక్షుడని, ఆంధ్రా బాబుల కనుసన్నల్లోనే ఆ పార్టీ ఉందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications