ఆ ప్రచారాలు నమ్మొద్దు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఈటలతో కలిసి ఢిల్లీకి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీలో పలు తాజా పరిణామాలు కొంత చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ బీజేపీ నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో వారు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేతలను బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది.
ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాగానాలు, ప్రచారాలు నమ్మవద్దని అన్నారు.

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలకు తన అభిప్రాయాలను తెలుపుతానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేని అన్నారు. కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర సహకరిస్తుందని.. ఇందులో భాగంగానే కేటీఆర్కు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇస్తున్నారని చెప్పారు. కేటీఆర్కు కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియా ఎక్కువ ప్రచారం చేసి చూపిస్తోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తలచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవమేనన్నారు.
కాగా, బీజేపీ అధిష్టానం పిలుపుతో ఈటల రాజేందర్తో కలిసి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ్నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ బయల్దేరే ముందు వారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఇద్దరు నేతలతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీకి బీజేపీ అధిష్టానం పిలవడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాలు, పార్టీలో పరిస్థితులపై వీరితో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications