హంతకులెవరు?: కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన ఇద్దరు చిన్నారులు దారుణహత్యకు గురయ్యారు. తలపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. ఛత్తీస్గడ్ రాజ్నాథ్ జిల్లా చుకేదాన్ మండలం బాట్లీ గ్రామానికి చెందిన రాంకుమార్ దులేష్ దంపతులతోపాటు కొంతమందిని అదే ప్రాంతానికి చెందిన అశ్విన్ అనే వ్యక్తి 15రోజుల క్రితం అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ కళాశాలలో జరుగుతున్న భవన నిర్మాణ పనుల నిమిత్తం కూలీ పనులు చేసేందుకు తీసుకొచ్చారు.
అక్కడే ఉంటున్న రాంకుమార్ దులేష్ దంపతులకు ధర్మేంద్ర(10), ముఖేష్(7) కుమారులు ఉన్నారు. రోజు మాదిరిగానే వారు కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి వెళ్లేటప్పుడు ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు.
అయితే, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ధర్మేంద్ర, ముఖేష్ కనిపించలేదు. వారి కోసం అర్ధరాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో బుధవారం హయత్నగర్ పోలీసులకు తెలపడంతో వారు ముమ్మరంగా గాలించారు.
గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్-కవాడిపల్లి సరిహద్దు ప్రాంతంలోని కొండల సమీపంలో ఇద్దరు బాలురు మృతిచెంది ఉన్నారని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడ పరిశీలించారు. తలపై బండరాయితో బలంగా మోదడంతో ధర్మేంద్ర, ముఖేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కాగా, వీరితోపాటు ఛత్తీస్గడ్ నుంచి వచ్చిన సోహన్ అనే వ్యక్తి సంఘటన జరినప్పటి నుంచి కనిపించకపోవడంతో బాలురను సోహన్ హతమార్చి ఉంటాడనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతడు వారిని చంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్, వనస్థలిపురం ఏసీపీ భాస్కర్గౌడ్, హయత్నగర్ సీఐ రవీందర్గౌడ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.
చందానగర్లో నలుగురు బాలికలు అదృశ్యం
హైదరాబాద్ నగరంలోని చందానగర్ ప్రాంతంలో నలుగురు బాలికలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వీరు గురువారం నుంచి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు బంధువుల ఇళ్లలో ఆరా తీసి ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.