కార్టూన్ ఛానల్ చూసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న బాలుడు, మృతి
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్టూన్ ఛానల్ చూసిన ఓ చిన్నారి.. తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. ఈ దుర్ఘటనలో చిన్నారి మృతిచెందాడు.
హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కార్టూన్ ఛానల్ చూసిన ఓ చిన్నారి.. తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. ఈ దుర్ఘటనలో చిన్నారి మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జియాగూడకు చెందిన 12ఏళ్ల జయదీప్ వెంకటాపురంలోని తాతయ్య దగ్గర ఉంటున్నాడు. శుక్రవారం టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ.. అందులోని బొమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం గమనించాడు. అయినా అవి హాయిగా.. నవ్వడం చూసి.. వెంటనే తనూ కూడా అలాగే చేయాలనుకున్నాడు.
ఇంట్లోని కిరోసిన్ డబ్బా తీసుకుని డాబాపైకి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలంటుకుంటూ ఉంటే.. అమ్మమ్మా.. తాతయ్యా.. అంటూ గట్టిగా అవరడం మొదలుపెట్టాడు.
ఏమయ్యిందో ఏమోనని పైకి వెళ్లి చూసేసరికి ఒళ్లంతా కాలిపోతోంది. వెంటనే బంధువుల సాయంతో మంటలు ఆర్పి.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోవటంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు జయదీప్ మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.