కేసులో సాయం చేస్తానని వివాహితను లోబర్చుకున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఇతనే (ఫోటో)
హైదరాబాద్: ఇన్స్పెక్టర్గా ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓ కేసులో వివాహితకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. చదివే పిల్లలున్న ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకొని లొంగదీసుకున్నాడు. ప్రమాదానికి గురై ఇంటికే పరిమితమైన ఆమె భర్త పరిస్థితిని అడ్డుపెట్టుకొని ఏకంగా ఆమెనే రెండో పెళ్లి చేసుకున్నాడు.
అయితే, అతడి ఆగడాలపై మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో దురాగతం బహిర్గతమైంది. విచారణలో నిజాలు తెలియడంతో సస్పెండయ్యాడు. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. ఆ నిందితుడు... చాదర్ఘాట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ధీరావత్ హుస్సేన్.
కొద్ది నెలల క్రితం చాదర్ఘాట్ ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఉద్యోగి బైక్ పైన ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం తప్పించుకున్నా తిరిగి ఉద్యోగం చేసే స్థితిలో లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.
దీంతో, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు లోనైంది. దీంతో, రోడ్డు ప్రమాదానికి గురైన ఆ వ్యక్తి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను ఢీకొట్టిన వాహనదారుడిని గుర్తించేందుకు పోలీసుల సహాయం అర్థించాలనే ఉద్దేశంతో బాధితుడి భార్య చాదర్ఘాట్ పోలీసు స్టేషన్కు వెళ్లింది.
ఆ సమయంలో ఎస్హెచ్వో సత్తయ్య సెలవులో ఉండటంతో ఎస్హెచ్వోగా అదనపు బాధ్యతలు నిర్వహించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ధీరావత్ హుస్సేన్ అమెతో పరిచయం పెంచుకున్నాడు. కేసులో సహాయం చేస్తానని నమ్మించి ఆమె సెల్ఫోన్ నంబరు తీసుకున్నాడు.
తరచుగా ఆమెతో మాట్లాడుతూ చనువు పెంచుకొని లోబరుచుకున్నాడు. ఆమె భర్త నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకొని ఇద్దరు డిగ్రీ చదివే పిల్లలున్న ఆమెను ఏకంగా రెండో వివాహం చేసుకొన్నాడు. మొదటి భార్యకు తెలియకుండా వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు.
కొన్ని రోజుల తర్వాత విషయం తెలుసుకున్న మొదటి భార్య నిలదీసింది. అయినా ప్రవర్తన మార్చుకోని నిందితుడు రెండో భార్యతో సంబంధం కొనసాగిస్తుండటంతో మొదటి భార్య పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణలో వాస్తవం వెలుగు చూడటంతో నగర కమిషనర్ మహేందర్ రెడ్డి దుష్ప్రవర్తన అభియోగంపై హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.