కొత్త రాష్ట్రాలు - కొత్త 'ఆపరేషన్': నిన్నటి చేదు లేకుండా.. ఎవరి సత్తా ఏమిటి?
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి నుంచి 2019 ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఓ భాగమేనని చెప్పవచ్చు.
ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ మొదటి నుంచి దూకుడుగానే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఒకింత ఆలస్యంగా మేల్కొన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు ఇటీవలే ఆపరేషన్ ఆకర్ష్ పైన దృష్టి సారించారు. ఇందులో భాగంగా 11 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణలో కెసిఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకలావికలం అవుతున్నాయి. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు 15 మంది గెలిస్తే ఏకంగా 12 మంది కారు ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఎప్పుడు ఎవరు కారు ఎక్కుతారోనని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
ఏపీలో కొన్నాళ్ల క్రితం వరకు ఆపరేషన్ ఆకర్ష్ కనిపించ లేదు. కానీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు దూకుడు పెంచారు. వైసిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి వివిధ రూపాల్లో ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపీలో టిడిపి నేతలలో కొందరు ఆపరేషన్ ఆకర్ష్ కోసం పని చేస్తున్నారని అంటున్నారు.
మెజార్టీ ఉన్నాక చేరికలు ఏమిటి?
ఇరు రాష్ట్రాల్లోను ప్రతిపక్షాలు ఓ ప్రశ్న సంధిస్తున్నాయి. కెసిఆర్, చంద్రబాబు ప్రభుత్వాలకు పూర్తి మెజార్టీ ఉన్నదని, అలాంటప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దానికి అధికార పార్టీ నుంచి రాజకీయంగా కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ నేతలను చేర్చుకున్నప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
ఆపరేషన్ 2019
ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రశ్నించినా, అధికార పార్టీ ఏ రకంగా స్పందించినప్పటికీ.. అందులో టార్గెట్ 2019 ఇమిడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో కెసిఆర్.. 2014 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచారనే చెప్పవచ్చు. టిఆర్ఎస్కు ఉద్యమమే ఉపయోగపడింది. తెలంగాణ వచ్చినందున 2019లో పార్టీకి బలం, కెసిఆర్ పని తీరు లెక్కలోకి తీసుకుంటారు.
కెసిఆర్కు ఉద్యమం, బాబుకు పవన్, మోడీ తోడు
119 సీట్లలో టిఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ కంటే కేవలం మూడు సీట్లు మాత్రమే అధికంగా గెల్చుకుంది. ఇక ఏపీలో దాదాపు వంద స్థానాలు గెలుచుకున్నప్పటికీ... పవన్ కళ్యాణ్ ప్రచారం, మోడీ లేదా బిజెపి అండ కలిసి వచ్చిందంటారు. జగన్ పదేపదే మాట్లాడుతూ.. టిడిపికి మా కంటే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని ఎద్దేవా చేస్తుంటారు.
2019 ఎన్నికలు
ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ఓ విధంగా 2014 సార్వత్రిక ఎన్నికలను (చేదు అనుభవం అనుకోవచ్చు) దృష్టిలో పెట్టుకొని 2019 ఎన్నికల్లో.. ఎలా ఉన్నా పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అలా అయితేనే చేదు అనుభవం లేకుండా.. సునాయాసంగా 2019 ఎన్నికల్లో గెలుస్తామని భావిస్తున్నారు. 2019 కోసమే పార్టీలో సీనియర్లను బుజ్జగించి, ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు.
చేరే వారిది ఒకేమాట
తెలంగాణలో, ఏపీలో అధికార పార్టీలలో చేరుతున్న వారు ఒకే మాట చెబుతున్నారు. కొత్త రాష్ట్రాలైనందున అభివృద్ధి కోసమే తాము అధికార పార్టీలో చేరుతున్నామని, తమ నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమని అంటున్నారు. చంద్రబాబు అనుభవజ్ఞుడని, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారని అందుకే చేరుతున్నామని చెబుతున్నారు. ఇక. తెలంగాణలో తెలంగాణ సాధించింది కెసిఆరేనని, కొత్త రాష్ట్రమైనందున బంగారు తెలంగాణ సాధించేది కూడా కెసిఆరేనని ప్రజలు నమ్ముతున్నారని చెబుతున్నారు.
చేరిక తలనొప్పి, డీలిమిటేషన్ పై ఆశలు
అధికార పార్టీల్లోకి తెలంగాణ, ఏపీల్లో విపక్షాల నుంచి ఎమ్మెల్యేల చేరిక.. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్, చంద్రబాబుకు తలనొప్పులు తీసుకు వస్తుందని అంటున్నారు. నేతలు ఎక్కువ అయితే.. పదవులు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని అంటున్నారు. అయితే, డీలిమిటేషన్లో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, అప్పుడు తలనొప్పి ఉండదని టిడిపి, టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్ ఆకర్ష్ ఇబ్బందులు
తెలంగాణలో ధీటుగా ఎదుర్కొనే ప్రతిపక్షం లేదు. కెసిఆర్ దూకుడును ఎవరూ అడ్డుకోలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి. చేరికలను ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితుల్లో లేదంటున్నారు. అదే సమయంలో ఏపీలో చంద్రబాబుకు బలమైన ప్రతిపక్షం ఉంది. కానీ జగన్ వైఫల్యాలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కెసిఆర్కు ఓ విధంగా సులభమేనని, చంద్రబాబుకు కష్టమని అంటున్నారు.
టిడిపికి ఏపీలో పెరుగుతున్న బలం, తెలంగాణలో ఖాళీ
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలం క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పెరుగుతోంది. చంద్రబాబు తెలంగాణను వదిలేశారనే వాదనలు కూడా ఉన్నాయి.
కొంటున్నారు
తమ పార్టీ ఎమ్మెల్యేలను బజార్లో పశువులను కొన్నట్లు కొంటున్నారని రెండు రాష్ట్రాల్లోను విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి కొంటున్నారని ఏపీలో జగన్ విమర్శిస్తే, తెలంగాణలో కెసిఆర్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.