విజయవంతమే, అభినందనలు: ఈటెల బడ్జెట్పై కేసీఆర్ సంతోషం
Recommended Video

హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈటెల బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందని అన్నారు.
అన్ని రంగాలను సమతూలన చేస్తూ బడ్జెట్ ప్రతిపాదించారని కేసీఆర్ అభినందించారు. ఆదాయ వనరులను పూర్తి సమతౌల్యంతో బడ్జెట్ రూపొందించారని అన్నారు.

కేసీఆర్ అభినందనలు
వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని కేసీఆర్ అన్నారు. ఇక వ్యవసాయ రంగం విజయవంతంగా ముందుకు సాగుతుందని చెప్పారు. వార్షిక ఆర్థిక ప్రణాలిక రూపొందించిన మంత్రి ఈటెల, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డిలను సీఎం అభినందించారు.

బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందరికీ అందించేలా బడ్జెట్ ఉందని అన్నారు. పోలీసు వ్యవస్థకు 5వేల కోట్లు కేటాయించి, ప్రజల భద్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని అన్నారు. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు.

పూర్తి న్యాయం
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజలకు పూర్తిగా న్యాయం చేసేలా బడ్జెట్ ఉందని తెలిపారు.

సంక్షేమానికి పెద్ద పీట
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు బీమా కల్పించడం మంచి కార్యక్రమమని అన్నారు. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందని, గత నాలుగు బడ్జెట్ లు కూడా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశాయని చెప్పారు. ఇది జనరంజక బడ్జెట్ అని అన్నారు.












Click it and Unblock the Notifications