ప్రజా దర్బార్.. కేసీఆర్ సరికొత్త పంథా: సామాన్యులు నేరుగా కలిసేలా!..
దరఖాస్తుల పరిశీలన, ప్రజాదర్బర్ లో పాల్గొనేవారి ఎంపిక కలెక్టర్లే చూసుకుంటారు.
హైదరాబాద్: ఆమధ్య కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారన్న వార్తలు వినిపించాయి గానీ.. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. బహుశా రాబోయే రోజుల్లో ఉండవచ్చునేమో తెలియదు గానీ.. ఇకనుంచి తమ గోడు వెల్లబోసుకోవాలనుకునే సామాన్యులకు నేరుగా తనతో మాట్లాడే అవకాశం కల్పించనున్నారు సీఎం కేసీఆర్.
సంక్రాంతి పండుగ తర్వాత ప్రజా దర్బార్ ను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ వేదికగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజా దర్బార్ నిర్వహణ విషయమై ఇప్పటికే సీఎంవో అధికారులు, పలువురు మంత్రులతో సీఎం చర్చించినట్టుగా తెలుస్తోంది.

ప్రజా దర్బార్ పంథా ఎలా ఉంటుందంటే?:
రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలతో పాటు వాటికి అతీతంగా తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న సామాన్యులందరికి ప్రజాదర్బార్ ద్వారా సీఎంతో మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టుగా సమాచారం. ప్రజా దర్బార్ ద్వారా నేరుగా సీఎంకు తమ సమస్యల గురించి విన్నవించుకోవచ్చు.

ప్రజా దర్బార్ రెండు రకాలు:
ప్రజా దర్బార్ లో అనుసరించాల్సిన పంథాను విధాలుగా అమలుపరిచే తీరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తొలుత కలెక్టర్ల ద్వారా సీఎంను కలవాలనుకునే వ్యక్తుల జాబితా తయారు చేస్తారు.
ఇందుకోసం సీఎంను కలవాలనుకునేవారు కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత కీలకమని భావించే దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని ప్రజాదర్బార్ లో పాల్గొనేందుకు వారికి అవకాశం కల్పిస్తారు.

జనహితభవన్ వేదికగా:
జనహితభవన్ వేదికగానే సీఎం కేసీఆర్ ప్రజాదర్బార్ కు సమాయత్తమవుతున్నారు. రైతులు, కార్మికులు, కూలీలు, కళాకారులు, ఉద్యోగులు, ఇలా తదితర వర్గాలందరితోను సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు.
వారి సమస్యలను వినడంతో పాటు అందుకోసం ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గాలపై సమాలోచనలు జరుపుతారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు, కార్యక్రమాల అమలుకు వారి నుంచి సలహాలు స్వీకరించే అవకాశం ఉంది.

అక్కడే భోజన సదుపాయం:
ప్రజాదర్బార్ లో సీఎంను కలవడానికి వచ్చే ప్రతీ ఒక్కరికి ప్రగతి భవన్ సముదాయంలోనే భోజన ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే రాను పోను వారికి రవాణా సదుపాయం కూడా ప్రభత్వమే కల్పించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వృత్తులు, కులాలు, సంఘాలు, యూనియన్లవారీగా ప్రతి వర్గంతో సీఎం నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో చర్చించి ప్రజాదర్బార్ కోసం సీఎం షెడ్యూల్ ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

డాక్యుమెంటరీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు:
బంగారు తెలంగాణ లక్ష్య సాధనను ఉద్దేశించే డాక్యుమెంటరీలు, వీడియో క్లిప్పింగ్స్ ను ప్రజాదర్బార్ లో ప్రదర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు చివరగా వారికి సీఎం సందేశమిచ్చేలా ప్రజాదర్బార్ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నారు.

కలెక్టర్లే నిర్ణయిస్తారు:
దరఖాస్తుల పరిశీలన, ప్రజాదర్బర్ లో పాల్గొనేవారి ఎంపిక కలెక్టర్లే చూసుకుంటారు. వారి దృష్టికి వచ్చే దరఖాస్తుల్లో కీలకమై వాటినే గుర్తించి.. వారికే ప్రజాదర్బార్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత పలానా తేదీ నాడు ప్రజాదర్బార్ లో పాల్గొనాలంటూ ఎంపికైనవారికి సమాచారం అందిస్తారు. ఉచిత రవాణా సదుపాయం కల్పించే కూపన్ కూడా అందజేస్తారు.












Click it and Unblock the Notifications