మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, కానీ..!
ప్రధాని నరేంద్ర మోడీపై తాను వ్యక్తిగతంగా ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని చెప్పారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పింది తాను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు.

తెలంగాణలో కులగణన సమగ్రంగా నిర్వహించామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవిష్యుత్తులో కమిషన్ గానీ కమిటీ గానీ వేసి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు చేరువ చేయాలనే దానిపై కసరత్తు చేస్తామన్నారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీపై తాను వ్యక్తిగతంగా ఏమీ దూషించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానని అన్నారు. పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారన్నారు. ప్రధాని హోదాను తగ్గించే వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ప్రధాని మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నాను.. కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు అని రేవంత్ తెలిపారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ సమయం విషయంలో తేడా ఉండొచ్చన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ చెప్పారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే జనగణన కూడా చేయాలన్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. కాగా, మోడీ కులంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2001లో మోడీ గుజరాత్ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీగా మార్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. అయితే, 1994లో కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications