కెసిఆర్ ఎలాంటి వ్యక్తో కవిత తీరు చెప్తుంది: రేవంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
గజ్వేల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన గజ్వేల్ పోలీసు స్టేషన్లో మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.
టిడిపి నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేపట్టిన దీక్షకు హాజరైన రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి పైన రాయలేని విధంగా దుర్భాషాలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నేతను కించపరిచేలా మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని గజ్వేల్ పట్టణ పోలీసు ఎస్సై సత్యనారాయణ చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.
కెసిఆర్ ఎలాంటి వ్యక్తో కవిత తీరు చెబుతుంది: రేవంత్ రెడ్డి
కేసీఆర్ తీరును అతని కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెబుతుందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి దీక్ష విరమణ సమయంలో ఆయన మాట్లాడారు.
సమాజంలో ఎవరైనా ఆడబిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతోందంటే, దాని అర్థం ఆమె తండ్రి చేతకాని వాడు, తాగుబోతు, తిరుగుబోతు, కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోనివాడు అని అర్థమన్నారు. ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది అంటే దాని అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు.
తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ రైతులను ఆదుకోవాలని, తక్షణం రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.