తెలంగాణకు ప్రియాంకా గాంధీ వాద్రా- వారిపై చర్యలు తప్పవ్
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తుది ఘట్టానికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఆయన ప్రవేశించారు. చివరి మజిలీ ఇదే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ నాయకత్వం- ఈ నెల 26 లేదా 30వ తేదీల్లో అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందనే అంచనాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా- దీనికి హాజరు కానున్నారు.
కొనసాగింపుగా..
అదే సమయంలో- దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ అధిష్ఠానం.. రాష్ట్రస్థాయిలో మరో జోడో యాత్రకు పిలుపునిచ్చింది. హాత్ సే హాత్ జోడో యాత్రను నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేయనున్నారు పార్టీ నాయకులు. తెలంగాణలో ఈ యాత్ర ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభం కానుంది. 60 రోజులపాటు సాగుతుంది. ఈ యాత్రను ప్రారంభించడానికి మూడు ప్రాంతాలను పరిశీలిస్తోన్నారు కాంగ్రెస్ నాయకులు. భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లల్లో ఒకదాన్ని ఖరారు చేయాల్సి ఉంది.
ప్రియాంక గాంధీకి ఆహ్వానం..
ఫిబ్రవరి 6వ తేదీన హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ వాద్రాను ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించారు కాంగ్రెస్ నాయకులు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ యాత్రను సమన్వయ పర్చడానికి ప్రత్యేకంగా పరిశీలకులను నియమించనున్నారు.
కొత్తవారికి ఛాన్స్..
హాత్ సే హాత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో పాల్గొని వారిపై వేటు వేయడానికి సిద్ధపడుతోంది. పని చేయని వారిని తప్పించడానికి వెనుకాడట్లేదు. వారిస్థానంలో అప్పటికప్పుడు కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. యాత్రలో పాల్గొనని వారిపైనా చర్యలు ఉంటాయనీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పార్టీకి నష్టం కలిగించేలా..
పార్టీకి నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు గానీ, బహిరంగ ప్రకటనలు గానీ ఉండకూడదంటూ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాకరే ఇదివరకే హెచ్చరించారు. అదే సమయంలో అధిష్ఠానం కూడా రాష్ట్రానికి రాబోతోన్న నేపథ్యంలో- అసమ్మతి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘ విరామం తరువాత గాంధీ భవన్ కు చేరుకోవడం చర్చనీయాంశమైంది.