హైదరాబాద్ పోలీసులకే ‘ధూమ్’ సినిమా చూపించిన పెరూ గ్యాంగ్(పిక్చర్స్)
హైదరాబాద్ నగరంలో చోరీలు జరగడం కొత్తే మీదు గానీ, ఓ కొత్త గ్యాంగ్ మాత్రం కొత్త తరహా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరింది.
హైదరాబాద్: నగరంలో చోరీలు జరగడం కొత్తే మీదు గానీ, ఓ కొత్త గ్యాంగ్ మాత్రం కొత్త తరహా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరింది. ఆ గ్యాంగ్.. అమెరికా ఖండంలోని పెరూ దేశం నుంచి వచ్చి మరీ ఈ చోరీలకు పాల్పడటం గమనార్హం. పెరూ దేశం నుంచి వచ్చిన ముగ్గురు దొంగలు ఓ నగల వ్యాపారికి చెందిన మూడున్నర కిలోల బంగారాన్ని అపహరించుకెళ్లిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.
కాగా, ఈ దోపిడీకి స్కెచ్వేసింది పెరూ గ్యాంగ్ అయితే.. అమలు చేసింది మాత్రం నైజీరియన్ దొంగలు. అయితే, ఈ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులే రట్టు చేశారు. దోపిడీకి సహకరించిన నలుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్ తోపాటు ముంబై, సూరత్, ఢిల్లీలోనూ ఈ తరహా దొంగతనాలకు పాల్పడినట్లు తేల్చారు. అంతేగాక, ఈ ముఠా.. వియత్నాం, మలేసియాల్లోనూ దోపిడీలకు పాల్పడినట్లు తెలిసింది.
ధూమ్ సినిమా చూపించారు..!
కూకట్పల్లి అటెన్షన్ డైవర్షన్ కేసు శోధనలో సైబరాబాద్ పోలీసులకు ఈ పెరూ గ్యాంగ్ ఏకంగా ‘ధూమ్' సినిమానే చూపించారు. దేశచరిత్రలోనే ఈ తరహా నేరం కాగా, ఇది తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ కేసులో నలుగురు నిందితుల్ని గురువారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సందీప్శాండిల్య తెలిపారు.
అసలేం జరిగింది..
శుక్రవారం మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఈ కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన నగల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన వద్ద ఉన్న ఆభరణాల్ని నగల దుకాణాల యజమానులకు చూపించి ఆర్డర్లు తీసుకునేందుకు గత ఏప్రిల్ 16న సాయంత్రం మూడు గంటల సమయంలో చందానగర్ వెళ్లారు. ఆ సమయంలో అతడి వెంట సంచిలో రూ.కోటిన్నర విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలున్నాయి.
వెంబడించిన దొంగలు..
తన స్కోడా కారు(టీఎస్12 ఈఏ 4620)లో డ్రైవర్తో కలిసి వెళ్లిన అభిషేక్ వద్ద బరువైన సంచి ఉండటంతో కూకట్పల్లి ప్రాంతం నుంచి దొంగల ముఠా కారును అనుసరించింది.
కారులోని నగల సంచిన అపహరించిన మహిళ..
చందానగర్లో నగలను చూపించేందుకు అభిషేక్ దుకాణంలోకి వెళ్లగా ఓ దుండగుడు ప్రత్యేకంగా తయారు చేసిన మేకును కారు వెనుక ఎడమ టైరుకు గుచ్చాడు. అనంతరం బయటకి వచ్చిన అభిషేక్, డ్రైవర్ కూకట్పల్లి నెక్సా షోరూం వద్దకు వచ్చేసరికి టైరులో గాలి లేకపోవడంతో రహదారి పక్కన ఆపి టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నగల సంచిని డ్రైవర్ సీటు కింద ఉంచడం ముఠా గమనించింది. టైరు మార్చుతుండగా ముఠాలోని మహిళ కారులోని నగల సంచిని చాకచక్యంగా అపహరించింది.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు ముగ్గురు దొంగల ప్రమేయాన్ని గుర్తించారు. చోరీ అనంతరం దొంగలు టయోటా క్రామ్నీ కారులో పారిపోయినట్లు సీసీ ఫుటేజీల్లో తేలడంతో ఆ కారు ఏప్రిల్ 9న తెల్లవారుజామున ఆలంపూర్ చెక్పోస్ట్ మీదుగా నగరంలోకి వచ్చినట్లు గుర్తించారు.
వేట కొనసాగించిన పోలీసులు..
అలాగే చోరీ జరిగిన తర్వాత 17న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని దేవనహళి చెక్పోస్ట్ మీదుగా వెళ్లినట్లు తేలింది. దీంతో దొంగలు బెంగళూరు పారిపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగింది. అయితే సీసీ పుటేజీల్లో వారి ముఖకవలికలు సక్రమంగా లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది.
కారు నెంబర్ ఆధారంగా..
టయోటా షోరూం, సర్వీస్ స్టేషన్ల ఆధారంగా కారు నంబరు చిరునామా గురించి వెతకడంతో ముంబైకి చెందిన పంకజ్ సత్యనారాయణ షరాఫ్ పేరుపై ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర క్రితం అతడు తబ్రేజ్ షేక్కు అమ్మినట్లు.. అతడి నుంచి రాజేశ్ సోనీ, ఎల్కే భాటియా, రోహిత్ల చేతులు మారినట్లు గుర్తించారు. తర్వాత బెంగళూరుకు చెందిన ఖలీల్ పాషా అలియాస్ రషీద్ కొని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టగా... గత ఏప్రిల్ 6న మైకేల్, బాల్కిన్స్ కొన్నట్లు తేలింది. అయితే ఇంత మంది యజమానులు మారినా పంకజ్ పేరుపైనే కారు ఉండటంతో పోలీసుల దర్యాప్తులో జాప్యం జరిగింది. బెంగళూరులోనే ఉంటున్న బాల్కిన్స్, మైకేల్లను ఆఫ్రికా దేశస్థులుగా గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని విచారించడంతో మరింత సమాచారం లభించింది.
మొత్తానికి పట్టేసిన పోలీసులు
బాల్కిన్స్ వద్ద నుంచి కారును బెంగళూరులోనే ఉంటున్న నైజీరియన్లు రిచర్డ్, హెన్రీలు అద్దెకు తీసుకున్నట్లు తేలింది. బెంగళూరులోని యూబీ సిటీ ప్రాంతంలో ఉంటున్న వీరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరితోపాటు నేరంతో సంబంధమున్న నైజీరియన్లు పాల్, వేల్నూ అరెస్ట్ చేసి చోరీకి వినియోగించిన కారుతోపాటు చోరీకి గురైన ఆభరణాల్లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించడంతో పెరూ నేరగాళ్ల విషయం బహిర్గతమైంది.
కారు పంక్చర్ కోసం ప్రత్యేక మేకు తయారీ..
బెంగళూరులోనే నౌషద్ అనే మెకానిక్ వద్ద కారు టైర్లను పంక్చర్ చేసే మేకుల్ని తయారు చేయించినట్లు తేలింది. బెంగళూరులోనే ఉంటున్న నైజీరియన్ బెంజిమన్ ఈ చోరీలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. పెరూ దేశ రాజధాని లిమాకు చెందిన మిరండా రోమియో డానియెల్, పెర్సీ మొయిజెస్, సుల్కా రోజా(కారులో నుంచి సంచిని అపహరించింది)తో బెంజిమన్కు గతంలోనే పరిచయం ఉన్నట్లు గుర్తించారు. కాగా, అరెస్టైన నిందితుల నుంచి కొన్ని ఆభరణాలు, ల్యాప్టాప్, నకిలీ పాస్పోర్టులు, సెల్ఫోన్లు, కర్ణాటక బ్యాంకు లిమిటెడ్, విజయాబ్యాంకుల డెబిట్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పెరూ దొంగలు మిరాండా రొమేరో డానియల్ అర్టురో, .పాచికో రోజస్ పెర్సీ మొయిజెస్, ఇన్ఫాంజన్ సుల్క రోజ యెస్బెల్(మహిళ) కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.