నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయండి.. లొంగే ప్రసక్తే లేదు.. నిరూపిస్తే రాజకీయ సన్యాసమే :ఈటల సంచలన సవాల్
మెదక్ జిల్లాలో భూకబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కొన్ని మీడియా ఛానెళ్లలో ముందస్తు ప్లాన్తో తప్పుడు కథనాలు ప్రసారం చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైనదని,నీతి బాహ్యమైనదని మండిపడ్డారు. ధర్మం,న్యాయం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురైన అంతిమ విజయం న్యాయానిదేనని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్పై చిల్లర ప్రచారాన్నిప్రజలు పట్టించుకోరని స్పష్టం చేశారు. తనది స్వయం కృషితో ఎదిగిన చరిత్ర అని... కావాలంటే తన మొత్తం చరిత్ర మీదే ఎంక్వైరీ చేయండని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఏమీ లేని నాడే ఏ ప్రలోభాలకు లొంగకుండా కొట్లాడినవాడినని గుర్తుచేశారు. ఆత్మగౌరవం ముందు ఏ పదవి తనకు గొప్ప కాదని... ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
అసలేం జరిగిందంటే... : మంత్రి ఈటల
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట,హకీంపేట మారుమూల గ్రామాల్లో 2016లో జమున హేచరీస్ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల తెలిపారు. అప్పట్లో ఎకరానికి రూ.6లక్షలు చొప్పున 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు. ఆ తదుపరి దాన్ని మరికొంత విస్తరించేందుకు మరో 7 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. ఈ క్రమంలో కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నామని చెప్పారు. పౌల్ట్రీ అనేది కార్పోరేట్ కంపెనీల తరహాలో రెండెకరాల్లో నిర్వహించేది కాదని.. దాని విస్తరణకు మరింత భూమి కావాల్సి వచ్చిందని చెప్పారు. అయితే చుట్టుపక్కల భూములన్నీ అసైన్డ్ భూములే కావడంతో పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
రైతులే స్వచ్చందంగా ఇచ్చారు : మంత్రి ఈటల
ఇదే విషయాన్ని సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం తరుపున ఇది కష్టమవుతుందని... ఒకవేళ అసైన్డ్ భూముల హక్కుదారులు వాళ్లంతట వారే ఆ భూమిని అప్పగిస్తే తీసుకోవచ్చునని సూచించినట్లు చెప్పారు. నిజానికి 1994 నుంచి ఇప్పటివరకూ అక్కడ ఒక ఎకరా భూమి కూడా సాగులో లేదన్నారు. దీంతో అక్కడి రైతులే తనను కలిసి ఆ భూములు మీరు కొనుక్కుంటే... ఆ డబ్బుతో మా బిడ్డల పెళ్లిళ్లయినా చేసుకుంటామని వాపోయారన్నారు. రైతులే స్వచ్చందంగా ఆ భూమిని తనకు అప్పగించారని చెప్పారు. అలా అక్కడి 25 ఎకరాలు తమకు కేటాయించాల్సిందిగా స్థానిక ఎమ్మార్వో అధికారులకు పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ భూములు రైతుల స్వాధీనంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
చావనైనా చస్తా గానీ...
1986లో తాను మొదటిసారిగా పౌల్ట్రీ ఫాం పెట్టానని... ఆరోజుల్లో అన్నీ తానై వ్యవహరించానని చెప్పారు. 1992 నాటికి 50 వేల కోళ్ల ఫాం స్థాయికి ఎదిగానన్నారు. పౌల్ట్రీ రంగంలో అత్యంత వేగంగా తాను అభివృద్ది చెందానని చెప్పారు. ఒకే తరంలో వందల కోట్లకు అధిపతులైనవారు చాలామంది ఉన్నారని... కానీ తాను శ్రమను నమ్ముకుని,పౌల్ట్రీపై ఆధారపడి స్వయంకృషితో ఎదిగానని చెప్పారు. తాను చావనైనా చస్తా గానీ ఎవరికీ లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. ఈటల రాజేందర్ భూమిని కోల్పోయినా ఫర్వాలేదు గానీ ఆత్మను అమ్ముకునే వ్యక్తి కాదన్నారు.
Recommended Video
నా మొత్తం చరిత్ర ఎంక్వైరీ చేయండి : ఈటల సవాల్
'నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయించండి... నేను తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధం... సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయమని నేనే డిమాండ్ చేస్తున్నా... రూ.100 కోట్లు పెట్టుబడితే అంతే స్థాయిలో రాయితీలు తీసుకునే పరిశ్రమలున్నాయి. కానీ నేను ఒక్క రాయితీ అడగలేదు. బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకునే స్థాయికి నేను ఎదిగానంటే అది నా నిబద్దత,నా ప్రొఫైల్ వల్లే... పదవులను గడ్డిపోచలని నేను చెప్పను... కానీ ఆత్మాభిమానం,ఆత్మగౌరవం కంటే పదవులు గొప్పవి కావు. మాలో మేము ఎర్ర చీమకు అన్యాయం చేయనోళ్లం... గడ్డిపోచను కూడా గౌరవించినోళ్లం... నేను ప్రలోభాలతోనో,కులం పేరుతోనే,మతం పేరుతోనే గెలవలేదు... మానవత్వంతో పైకొచ్చాను... నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా... పెయిడ్ ఛానెళ్లు కుసంస్కారంతో వ్యవహరిస్తే పాతరేస్తా... ఈటల ఏమీ లేని నాడే కొట్లాడిండు.. ప్రలోభాలు ఉన్నప్పుడు కూడా కొట్లాడిండు.. ఎన్ని దర్యాప్తు సంస్థలున్నాయో... అన్నింటితో విచారణ జరిపించండి... అందుకు నేను సిద్దం...' అని ఈటల తేల్చి చెప్పారు.