బీఆర్ఎస్లో తెగిన మరో టికెట్- కాంగ్రెస్లో చేరిక..?
ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు బీఫామ్లను అందజేస్తోన్నారు.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం (Vemula Veeresham), కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల తొలి జాబితా (Telangana Congress first list 2023)ను విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీలిమా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు.

బీఆర్ఎస్ ఇదివరకే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. టికెట్ దక్కకపోవడంతో ఇప్పటికే పలువురు సీనియర్లు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన నాయకులకు తొలి జాబితాలో చోటు కూడా కల్పించింది కాంగ్రెస్.
మైనంపల్లి హన్మంతరావు- మల్కాజ్గిరి, మైనంపల్లి రోహిత్ రావు- మెదక్, జూపల్లి కృష్ణరావు- కొల్లాపూర్, వేముల వీరేశం- నకిరేకల్.. స్థానాలను కేటాయించింది. ఇది- వలసలను మరింత ప్రోత్సహించినట్టయింది. వలస పక్షులకు టికెట్లను ఇవ్వడం ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసినట్టయింది.
దీని ప్రభావంతో తాజాగా బీఆర్ఎస్లో మరో వికెట్ పడింది. పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ.. బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ ఉదయం ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్కు పంపించారు.
తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఇదివరకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు వివరించినట్లు బాలసాని వెల్లడించారు. నేడో, రేపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సంప్రదింపులు సైతం జరిపారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications