నరేంద్ర మోడీ మరో షాక్: నోట్ల మార్పిడికి బ్రేక్ అంటూ ప్రచారం, వివరణ
కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని చూస్తోందని తెలుస్తోందని పెద్ద ఎత్తున శుక్రవారం నాడు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన లేదని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: పాత నోట్లతో కొత్త నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని తెలుస్తోంది. పలు మీడియా ఛానల్స్ శుక్రవారం నాడు కొన్ని షాకింగ్ ప్రసారాలు చేశాయి. కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలని చూస్తోందని తెలుస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు 'వన్ ఇండియా'తో మాట్లాడుతూ.. కేంద్రం నోట్ల మార్పిడికి బ్రేక్ వేయాలనుకుంటుందనే ప్రచారం అవాస్తవమైనదని చెప్పారు. మార్పిడిని ఇప్పుడు ఆపివేసే ఆలోచన లేదని చెప్పారు. అది అబద్దపు ప్రచారమని అభిప్రాయపడ్డారు.
కాగా, రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరో షాకింగ్ నిర్ణయానికి వచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగింది.
కొద్ది రోజుల పాటు బ్యాంకులలో నగదు మార్పిడిని నిలిపివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నాయి. బ్యాంకుల వద్ద రద్దీ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.