మూడేండ్ల కిందట లంచం.. ఇంతవరకు పనిగాలే.. వీఆర్వోపై తిరగబడ్డ రైతులు..! (వీడియో)
Recommended Video
వరంగల్ : రెవెన్యూ శాఖ కాసుల పంటకు కేరాఫ్ అని ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. అటెండర్ నుంచి ఎమ్మార్వో దాకా జనాల నుంచి పైసలు గుంజే కార్యక్రమం బయటపడుతూనే ఉంది. ఇటీవల కేశంపేట ఉత్తమ మహిళా ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఆమె అవినీతి పర్వం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ క్రమంలో తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ ఉద్యోగిని రైతులు నిలదీయడం చర్చానీయాంశమైంది. లంచం తీసుకోవడమే గాకుండా పని చేసి పెట్టలేదనే ఆరోపణలతో కొందరు రైతులు ఆయనను అడ్డుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

రెవెన్యూ శాఖలో మరో జలగ..!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మరో రెవెన్యూ అధికారి లీలలు బయటపడ్డాయి. మడిపెల్లి గ్రామ శివారు సోమారపు కుంట తాండాకు చెందిన ధరావత్ భాస్కర్ అనే రైతు వీఆర్వో వెంకటసోములుపై ఆరోపణలు గుప్పించారు. తనకున్న ఎనిమిది ఎకరాల భూమిని పట్టా చేస్తానని నమ్మించి మూడేళ్ల కిందట 26 వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఫైరయ్యారు. అయితే తన భూమిని పట్టా చేయకుండా తిప్పుకున్నారని.. ఆ క్రమంలో వేరే చింతలపెల్లి గ్రామానికి బదిలీ కావడంతో తనను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
అయితే బుధవారం నాడు ఎమ్మార్వో ఆఫీసులో సదరు వీఆర్వో కనిపించగా అతడిని భాస్కర్ నిలదీశాడు. తన పని ఎంతవరకు వచ్చిందని ఫైరయ్యాడు. లంచం తీసుకోవడమే గాకుండా తన పని పెండింగ్లో పెట్టావని ఎదురు తిరిగాడు. ఆ వీఆర్వో తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నంలో అతడిని బయటకు లాక్కొచ్చాడు. తనకు సమాధానం చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశాడు. అలా మాట్లాడుతున్న క్రమంలో ఇతర రైతులు కూడా జోక్యం చేసుకుని వీఆర్వో తీరుపై మండిపడ్డారు. ఒకానొక దశలో వీఆర్వోను నెట్టివేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
మొన్న కేశంపేట.. ఇవాళ తొర్రూరు
ఇటీవల రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య అడ్డంగా దొరికిపోయారు. భూములను పట్టాలు చేయించే క్రమంలో జనాల నుంచి లక్షల కొద్దీ లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆమె ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 93 లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆమె ఇదివరకు ఉత్తమ మహిళా ఎమ్మార్వోగా ఎన్నిక కావడం గమనార్హం. కానీ ఆమె విధినిర్వహణలో చేసింది మాత్రం అన్నీ అరాచకాలే అని తేలింది.
లావణ్య బాగోతం బయటపడగానే పెద్దసంఖ్యలో బాధితులు బయటకొచ్చారు. లంచం ఇస్తే భూములు పట్టాలు చేసేవారని.. లేదంటే రికార్డులు తారుమారు చేసేవారని ఆరోపించారు. ఆ క్రమంలో కేశంపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో బాధితులు బైఠాయించి నిరసన తెలిపారు.

పనికో రేటుతో గుంజేస్తున్నారు..!
రెవెన్యూ శాఖలో వెలుగుచూస్తున్న అక్రమ పర్వం నివ్వెరపోయేలా చేస్తుంది. పనికో రేటుతో ఆఫీసుకొచ్చే జనాలను జలగల్లా పీడిస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు. కొన్నిచోట్ల లంచాలు తీసుకుంటూ కూడా పని చేసి పెట్టకపోవడం గమనార్హం. రెవెన్యూ ఉద్యోగులు చెప్పే మాటలకు భయపడి నయానో భయానో ముట్టజెప్పుతున్నారు జనాలు. ఒకవేళ లంచం ఇవ్వకుంటే ఉన్న భూమి కూడా పోతుందని భయపడి చాలామంది రైతులు వాళ్లు అడిగినంత ఇస్తున్నారనే ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.












Click it and Unblock the Notifications