తాగారు: పైశాచికానందం కోసం షాపులను తగలబెట్టారు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు ఇద్దరు యువకులే కారణమని పోలీసులు గుర్తించారు. మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదు దుకాణాలు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దుకాణాలకు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారకులైన ఆ ఇద్దరు నిందితులు చిరంజీవి, విజయేంద్రవర్మను డీపీసీ ప్రకాశ్రెడ్డి బుధవారం ఉదయం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణాలకు నిప్పు పెట్టే కంటే ముందు వారిద్దరూ అక్కడ రెక్కీ నిర్వహించారు. అయితే నిప్పు పెట్టిన వెంబడే మంటలు అంటుకోకపోవడంతో రెండు, మూడు సార్లు దుకాణాలకు నిప్పు పెట్టారు.
నిందితుల్లో ఒకరు మాదాపూర్ 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ పోలీసు అధికారి కుమారుడు. నిందితుల నుంచి పల్సర్ బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు కంబైన్డ్ స్టడీ కోసమని వీరిద్దరూ బయటకు వచ్చారు.
అనంతరం నాగోలు చౌరస్తాలో అతిగా మద్యం సేవించిన వీరిద్దరూ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ పలు దుకాణాలకు నిప్పటించారు. షాపులు మంటల్లో కాలిపోతుంటే పైశాచికానందం పోందారు.
ఆనందం కోసమే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విజయేంద్ర వర్మ, చిరంజీవి సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నట్లు విచారణలో తేలింది. గతంలో ర్యాష్ డ్రైవింగ్లో వీరిద్దరికి రూ. 500 జరిమానా విధించినట్లు కూడా పోలీసులు తెలిపారు.