డ్రామాలు ఆపండి: గణేశ్, చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గణేశ్గుప్తా తీవ్రంగా మండిపడ్డారు. ఇక డ్రామాలు ఆపి.. ఈ కేసులో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డి అరెస్టు అయితేనే శాంతిభద్రతలు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు సక్రమంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదని చెప్పారు. హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా తెలంగాణ వారేనని ఉద్ఘాటించారు. దొంగలే పీఎస్లో పిటిషన్ వేసినట్లు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఎద్దెవా చేశారు.
చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుపై న్యాయవాది భార్గవ్ గురువారం రంగారెడ్డి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారటూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన కోర్టు.. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.