వాట్సప్ మెసేజొచ్చినా పరిగెత్తిస్తున్నారు: కెసిఆర్పై హరీశ్‘రైతులకు కాల్ సెంటర్’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు వాట్సప్లో ఏ మెసేజ్ వచ్చినా, తమను పరిగెత్తించి పనులు చేయిస్తున్నారని అన్నారు. ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్ది అఅని అన్నారు.
29 రాష్ట్రాల ప్రజలు 'బెస్ట్ సీఎం కేసీఆర్' అంటూ అభినందించారని అన్నారు.
ఉద్దేశపూర్వకంగా తమ ప్రభుత్వంపై బురదజల్లాలనుకుంటే ఎవరికైనా సమాధానం చెబుతామన్నారు. మల్లన్న సాగర్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హరీష్ రావు అన్నారు.

రైతులకు కాల్ సెంటర్లు
ఖరీఫ్ సీజన్కు నీటిపారుదల శాఖ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. నీటి విడుదల తదితర అంశాలపై శాఖాపరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు రైతుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రస్థాయి కాల్సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నదని, రైతులకు ఇది కీలకమైన సమయం కాబట్టి ఇంజినీర్లంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతు సంప్రదించేందుకు వీలుగా సాగునీటి కాల్వల గట్లమీద, గ్రామపంచాయతీ నోటీస్బోర్డుల మీద ఇంజినీర్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ఉంచాలని ఆయన నిర్దేశించారు.
రైతులతో ఎప్పటికప్పుడు విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తూ వారు ఏమేం చేయాలనే దానిపై స్పష్టమైన వివరాలతో శనివారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిరంతరం ఫీల్డుకు వెళ్లి పనులు పర్యవేక్షించాలి. రైతులకు అందుబాటులో ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల్లో పూడికతీత పనులు, మరమ్మతులకు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి.
కాల్వల దగ్గర ఉండే డిస్ప్లే బోర్డులు, గ్రామపంచాయతీ నోటీసు బోర్డులపై విధిగా సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పేర్లు, వారి మొబైల్ నంబర్లను రాయాలి. దీనివల్ల రైతులకు సమస్యలు తలెత్తినపుడు ఆయా ఇంజినీర్లకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది.
నీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్న వెంటనే నీటి లభ్యత, నీటి సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలి. వాళ్లు ఏయే పంటలు వేస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. ఇందుకు రెవిన్యూ, వ్యవసాయ శాఖల సహకారం తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలానికి ముందు కీలక దశలో ఉన్నందున అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఆయకట్టు మ్యాపులు, రైతుల వివరాలను నమోదు చేసి గ్రామ పంచాయతీకి, రెవెన్యూ అధికారులకు పంపించాలి.
ఆయా వివరాలను గ్రామపంచాయతీ నోటీస్ బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి గ్రామపంచాయతీ, డిస్ట్రిబ్యూటరీ స్థాయిలో రైతులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి. రైతుల సమస్యలను సహనంతో విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఇది రైతుల ప్రయోజనాలు కాపాడే సర్కారు అని వారికి నమ్మకం కలిగేలా వ్యవహరించాలి.
ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధిని ఖరారు చేసుకోవాలి. కిందిస్థాయిలో ఏ పనుల పట్ల నిర్లక్ష్యం వహించినా, సకాలంలో పూర్తికాకపోయినా చీఫ్ ఇంజినీర్లను బాధ్యులుగా గుర్తిస్తాం. ఏఈఈ నుంచి ఎస్ఈ వరకు ఎక్కడ లోటు పాట్లు జరిగినా చీఫ్ ఇంజినీర్లే జవాబుదారీగా ఉండాలని హరీశ్రావు సర్కులర్లో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications