తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమటానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వెల్లడించింది.
బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
వర్షాలతోపాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
జూన్ల 24 వరకు రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గడిచి 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాపాతం రికార్డయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. అయితే, సాయంత్రం నుంచి వాతావరణం చల్లగా మారి జల్లులు కురుస్తుండటంతో ఉపశమనం పొందుతున్నారు.












Click it and Unblock the Notifications