ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత: ఎన్కౌంటర్ నేపథ్యంలో ఖాకీల అలర్ట్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శనివారం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై మెరుపుదాడి జరపడంతో 12 మంది జవాన్లు మృత్యువాత పడటంతో యుద్ధ వాతావరణం నెలకొంది.
భూపాలపల్లి: ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో శనివారం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై మెరుపుదాడి జరపడంతో 12 మంది జవాన్లు మృత్యువాత పడటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పల్లెజనం భయం గుప్పిట్లో వణుకుతున్నారు.
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా బెజ్జం అడవి ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై రాయపూర్ ఆప్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. 219వ బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు బెజ్జం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఇదే క్రమంలో మావోయిస్టులు వారి రాకను పసిగట్టే ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ను పేల్చారు. దీంతో క్షతగాత్రులైన పోలీసులు షాక్కు గురై అప్రమత్తమవుతున్న క్రమంలోనే మావోయిస్టులు చుట్టుముట్టి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. మరో ఇద్దరు రాయ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పక్కాప్లాన్తో ప్రతీకారం...
గత ఫిబ్రవరి నెలలో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన భారీ ఎదురుదెబ్బగా భావించి సుకుమా జిల్లాలో 12 మందిని హతమార్చడంతో మావోయిస్టులు తమ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
వేసవిలో ఎదురుదెబ్బ...
మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉన్న అడవులను టార్గెట్గా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇటీవలే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు వేసవిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించారు. అయితే అడవి లోపలికి చొచ్చుకుపోతున్న సీఆర్పీఎఫ్ పోలీసులకు సుకుమా జిల్లా బెజ్జం అడవుల్లో జరిగిన దాడితో భారీ ప్రాణనష్టం జరిగింది. దీంతో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవుల్లో మావోల కదలికలు సరిహద్దు పల్లెవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల మావోయిస్టులు గడ్చిరోలి జిల్లాలో భారీ ర్యాలీ, సమావేశాలు నిర్వహించి సవాల్ విసిరారు.