ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి: టి స్పీకర్కు గడువిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నమోదైన ఫిర్యాదులపై ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నవంబరు 8లోగా తెలపాలంటూ శాసన సభ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా ఆదేశాలివ్వాలంటూ శాసన సభ్యుడు సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ ఫాలీ నారిమన్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది ఉదయ్కుమార్ సాగర్ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
2014లో ఎన్నికలు జరిగాయని, ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వీలైనంత త్వరగా స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ 2015లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసన సభ్యులపై ఫిర్యాదులను ఏప్పటిలోగా తేలుస్తారో నవంబరు 8వ తేదీలోగా తెలపాలని బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గైర్హాజరు దృష్టిలో పెట్టుకొని ఈ కేసు తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది.