భార్య ఎదుటే మరొకరితో పెళ్లి: యువతి హల్చల్.. పావురం మెడకోసి వేలాడేసింది
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వ్యక్తి... తన భార్య చూస్తుండగానే మరో మహిళకు తాళి కట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. దీంతో, బాధిత భార్య మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డయాన అనే యువతి, ఆటో డ్రైవర్ మోజెస్ మూడేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె, మూడు నెలల కుమారుడున్నారు. ఏడాది కాలంగా మోజెస్ తరచూ భార్యను వేధిస్తున్నాడు. శనివారం మరో యువతిని మోజెస్ తీసుకువచ్చి భార్య ముందే ఆమె మెడలో తాళి కట్టాడు.
అవాక్కయిన డయాన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా... తాను తాళి కట్టిన రెండో భార్యకు గతంలోనే వివాహమైందని, మూడేళ్ల కుమార్తెతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్నట్లు మోజెస్ చెప్పాడు.
ఆమెతో పరిచయం చేసుకున్న మోజెస్ ఆమె కుమార్తెను కూడా ఎవరికో విక్రయించాడు. తన పాపను ఇవ్వాలని శనివారం నాడు ఆ యువతి వచ్చి నిలదీసింది. దీంతో చేసేది లేక భార్య ముందే ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పావురం మెడకోసి ప్లాట్కు వేలాడదీసి...
ఓ యువతి ఓ పావురం పట్ల శనివారం కర్కశంగా వ్యవహరించింది. ఓ పావురం ఎగురుగుంటూ బంజారాహిల్స్లో అపార్టుమెంటులోకి వెళ్లింది. ఆ పావురాన్ని పట్టుకున్న ఓ యువతి... దాని మెడను కోసి, ఫ్లాట్కు వేలాడదీసింది. ఇదేమిటని పక్కనున్న ప్రశ్నిస్తే... తన జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి అని హెచ్చరించింది.
కాగా, ఆమె ఓ రిటైర్డ్ ఐపీఎస్ కుమార్తెగా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో బంజారాహిల్స్లోని ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగింది. ఆమె నిత్యం మిగతా ప్లాట్ల వారితో గొడవ పెట్టుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.