Huzurabad By-poll : లేఖ రాసి షాకిచ్చిన ఎన్నికల సంఘం .. ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్టేనా!!
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని హడావిడి చేస్తున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చిందా? రాష్ట్రం హుజురాబాద్ కరోనా పరిస్థితులపై ఫోకస్ పెట్టటంతో ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందని జరిగిన చర్చ నిజమైందా? కేంద్ర ఎన్నికల కమీషన్ లేఖతో ఇప్పుడు ఉపఎన్నిక ఆలస్యం అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? కరోనా మహమ్మారి అందుకు కారణమా ? అంటే అవును అనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
హుజురాబాద్ లో ఉపఎన్నిక ఇప్పుడు అనుమానమేనా.. కేసీఆర్ కొత్త ప్లాన్ ఇదేనా ? తెరపైకి కొత్త చర్చ
హుజురాబాద్ లో ఉప ఎన్నిక జోరు
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో విడుదలవుతుందని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ హడావిడి మొదలు పెట్టాయి. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు పెట్టి అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు రంగంలోకి దిగారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావునేరుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.మరో అడుగు ముందుకేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కూడా ఖరారు చేసింది టీఆర్ఎస్. దీంతో హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ విషయంలో విడుదల చేసిన లేఖ
ఇక నేడో రేపో విడుదలవుతుందని అందరూ భావించిన షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖతో మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ, ప్రాంతీయ పార్టీల నుద్దేశించి 9వ తేదీన లేఖ విడుదల చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖలో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటుగా, మరికొన్ని రాష్ట్రాలలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉందని కరోనా పరిస్థితులలో సాధారణ లేదా ఉపఎన్నికలు జరిగే చోట అనుసరించవలసిన అనేక మార్గదర్శకాలను జారీ చేశామని పేర్కొంది.
కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలను కోరిన సిఈసి
గతంలో కరోనా సమయంలో కూడా కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, గతంలో జారీ చేసిన ఆయా మార్గదర్శకాలపై పార్టీల అభిప్రాయాన్ని ఈనెల 30వ తేదీలోగా వెల్లడించాలని లేఖ ద్వారా కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని భావించిన అందరికీ లేఖ ద్వారా ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేది చెప్పకనే చెప్పింది.
అందరి అభిప్రాయాలు పరిశీలించాకే ఎన్నికల నిర్ణయం
రాజకీయ పార్టీల నుండి సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత, వాటిని పరిశీలించడానికి కూడా కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ పై ఒక నిర్ణయం తీసుకుంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో జరగాల్సిన ఎన్నికలతో పాటు, ఇప్పటికే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది .
దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు
దేశంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలతో పాటుగా ఏపీ, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలలోనూ వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందనుకుంటే లేఖతో షాక్ ఇచ్చిన ఎన్నికల కమీషన్
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతున్న ఈ తరుణంలో ఈ నెలలోనే ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో హుజురాబాద్ మీద ఫోకస్ చేస్తే, ఎన్నికల నిర్వహణ పై అన్ని పార్టీల అభిప్రాయాలను కోరుతూ సలహాలు, సూచనలు అందించాలని, ఆపై ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించటం గమనార్హం. ఇదిలా ఉంటే తెలంగాణా ప్రభుత్వం కూడా ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రంలో, ముఖ్యంగా హుజురాబాద్ లో కరోనా పరిస్థితులపై నివేదిక ఇచ్చింది.
Recommended Video
ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి
మరోపక్క హుజరాబాద్ నియోజకవర్గంలోనూ కరోనా పరిస్థితి పై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ హుజురాబాద్ లో పొలిటికల్ యాక్టివిటీ పెరుగుతున్న కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ఎన్నికలు జరిగేలా, ప్రతికూలంగా ఉంటే కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా పడేలా చూస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఈ విషయంలో అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేసేలా చేస్తారని కూడా వారు అనుమానించారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ ఎన్నికల ప్రక్రియకు జాప్యం జరుగుతుందని చెప్పగా, మరో నెల తర్వాత అయినా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కూడా ఈసారి బలంగా పోరాటం చేస్తున్న వేళ ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు అందరికీ ఉత్కంఠ నెలకొంది.